రామ్ ఇన్ఫో, ఐప్యాక్‌తో ఓటర్ల సమాచారం సేకరణ : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్

by Disha Web Desk 21 |
రామ్ ఇన్ఫో, ఐప్యాక్‌తో ఓటర్ల సమాచారం సేకరణ : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఓటర్ల వ్యక్తిగత సమాచారంపై సిటిజన్స్ ఫర్ డెమెుక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రామ్ ఇన్ఫో, ఐప్యాక్‌తో ఓటర్ల సమాచారం.. వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో బూత్‌ స్థాయిలో కీలకంగా వ్యవహరించే విపక్ష నేతలను కేసులతో బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఓటర్ల సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఐప్యాక్‌, రామ్‌ ఇన్ఫో వంటి సంస్థలు ఓటర్ల సమాచారం సేకరిస్తున్నాయి అని ఆరోపించారు. రామ్‌ ఇన్ఫో సంస్థ గతంలో వాణిజ్య పన్నుల విభాగంలో సేవలు అందించిందని ఆ తర్వాత సంస్థ యాజమాన్యం చేతులు మారిందని చెప్పుకొచ్చారు. నాటి నుంచి దాని పనితీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. సామాజికంగా ప్రభావితం చేయగలిగే వారిని ఐప్యాక్, రామ్ ఇన్ఫో వంటి సంస్థలు గుర్తిస్తున్నాయని ఆ సమాచారం ఆధారంగా అధికార పార్టీ నాయకులు వాళ్లను సామ, దాన, భేద, దండోపాయాలతో లొంగదీసుకుంటున్నారు అని ఆరోపించారు. ఇకపోతే రాష్ట్రంలో ఇటీవల ఎఫ్ఐఆర్‌లు విపరీతంగా నమోదు అవుతున్నాయని అందుకు కారణం బెదిరింపులేనని ఆరోపించారు. ఎఫ్ఐఆర్‌లను బెదిరింపులకు అస్త్రంగా వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌ల నమోదుపై ఓ కమిటీ వేయాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సూచించారు. రిటైర్డ్ పోలీసు అధికారులతో ఎఫ్ఐఆర్‌ల నమోదుపై పరిశీలన చేయించే ఆలోచన ఉందని...కమిటీ విచారణలో తేలిన వాస్తవాలను హెచ్ఆర్‌సీ ముందు ఉంచుతాం అని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు.

అక్రమ కేసులు బనాయిస్తే ఎలా?

పోలీసులు కొంతమందిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారన్న సమాచారం ఉందని సిటిజన్స్ ఫర్ డెమెుక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. అక్రమంగా కేసులు బనాయించే హక్కు పోలీసులకు లేదన్న ఆయన అలా చేస్తే ప్రజల హక్కులను హరించడమే అవుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పోలీసులు విచక్షణతో వ్యవహరిస్తారని తాము నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. అక్రమ కేసుల నమోదు తమ దృష్టికి వస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇకపోతే ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు నమోదు చేయించుకోవడానికి తనకే మూడేళ్లు పట్టిందని..స్థానికంగా నివాసం ఉండటం లేదనే కారణంతో ఓటు హక్కు కష్టమవుతోంది అని చెప్పుకొచ్చారు. తప్పుడు సమాచారం, దుర్బుద్ధితో ఫామ్‌ 7 దరఖాస్తు చేస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారని సిటిజన్స్ ఫర్ డెమెుక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed