CM KCR Big Plan: ఏపీలో బీఆర్ఎస్ హామీలు ఇవే..!

by Disha Web Desk 16 |
CM KCR Big Plan: ఏపీలో బీఆర్ఎస్ హామీలు ఇవే..!
X

దిశ, ఏపీ బ్యూరో: భారత రాష్ట్ర సమితి పార్టీ ఏపీలో అడుగు పెట్టడానికి రంగం సిద్ధమైంది. ఇక్కడ ఆ పార్టీ ప్రభావం గురించి ఈ పాటికే ప్రధాన రాజకీయ పక్షాలు అంచనాలు వేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారనే దానిపై ఎవరికి తగ్గట్లు వాళ్లు బేరీజు వేసుకుంటున్నారు. వాస్తవానికి టీఆర్‌ఎస్​జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారినా కేసీఆర్‌ను ఇక్కడ ప్రజలు రాష్ట్ర విభజనకు కారకులుగానే భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు అడ్డంకులు సృష్టిస్తుందనే అపవాదును మూటగట్టుకుంది. ఇంకా విభజన కాని ఆస్తులపై పేచీలు బీఆర్‌ఎస్‌కు ఇరుకున పెట్టొచ్చు. కృష్ణా, గోదావరి జల వివాదాల విషయంలోనూ ఇరు రాష్ట్రాల విభేదాలు ఇబ్బందిగా మారే అవకాశమున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు స్పిల్​వే డిశ్చార్జి వాటర్​36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచడం వల్ల బ్యాక్​ వాటర్‌తో తెలంగాణలోని వ్యవసాయ భూములు ముంపునకు గురవుతాయని ఆందోళన వెలిబుచ్చుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో వివాదం నడుస్తోంది. ఇంకా కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై పలు విభేదాలున్నాయి. ఇవి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సామరస్యంగా పరిష్కరించుకోకుండా ప్రజల మద్దతు పొందడం కష్టం.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీ నుంచి వినియోగించుకున్న విద్యుత్‌కు సంబంధించి సుమారు రూ.6 వేల కోట్లకు పైగా బకాయి రావాలని వైసీపీ సర్కారు చెబుతోంది. కేంద్రం బాధ్యత తీసుకొని ఈ సొమ్మును ఇప్పించాలని అడుగుతున్నా తెలంగాణ సర్కారు ససేమిరా అంటోంది. ఇంకా విభజనకు నోచుకోని ఆస్తుల విలువ లక్ష కోట్లకు పైగా ఉంటుందని ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్​కుమార్​వెల్లడించారు. ఈ అంశం కూడా ఇక్కడ బీఆర్‌ఎస్‌కు చిక్కులు ఎదురయ్యే అవకాశముంది.

ఇవన్నీ ఒక ఎత్తయితే రాష్ట్రాన్ని చాలా అన్యాయంగా విభజించారని, అందుకు ప్రధాన కారకుడు కేసీఆర్​అనే భావన ప్రజల్లో బలీయంగా ఉంది. ఇది బీఆర్‌ఎస్​ఎదుగుదలకు పెద్ద ఆటంకమవ్వొచ్చు. ఈ అపవాదు నుంచి బయటపడేందుకు బీఆర్‌ఎస్​నాయకులు ఏపీకి ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తికి సవరించిన అంచనాల ప్రకారం నిధుల కేటాయింపు, విశాఖ స్టీల్​ప్లాంటు పరిరక్షణ, సొంత గనుల కేటాయింపునకు హామీ ఇవ్వడం ద్వారా ప్రజల నుంచి మద్దతు పొందవచ్చని బీఆర్‌ఎస్​నాయకులు భావిస్తున్నారు.

విభజనతో ఏర్పడిన రెవెన్యూ లోటు సొమ్ముకు కేంద్రం పలు కొర్రీలు వేసింది. సుమారు రూ.30 వేల కోట్లుగా ఉన్న రెవెన్యూ లోటును బాగా తగ్గించి చూపింది. దీన్ని మళ్లీ సమీక్షించి న్యాయం జరిగేట్లు చేస్తామని బీఆర్‌ఎస్​హమీనివ్వొచ్చు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ, భారీ పోర్టు, రాజధాని నిర్మాణానికి నిధులు, విభజన చట్టం ప్రకారం ఇంకా రావాల్సిన సదుపాయాలపై స్పష్టమైన హామీలు ఇవ్వడం ద్వారా ప్రజల నుంచి ఆదరణ పొందగలమనే ధీమాతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం కేంద్రం విధించే విషమ షరతుల వల్ల సగటు ప్రజలపై కరెంటు చార్జీల నుంచి యూజర్​చార్జీల భారాలు అధికమయ్యాయనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మొత్తంగా కేంద్రం విధానాల వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రచారం చేయడం ద్వారా ప్రజామోదం పొందాలని బీఆర్‌ఎస్​ఎత్తుగడ కావొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఏపీలో BRS పోటీపై సజ్జల కీలక వ్యాఖ్యలు..

Next Story

Most Viewed