YCP సారథులొచ్చేశారోచ్.. తెరపైకి గృహసారథులు!

by Disha Web Desk 16 |
YCP సారథులొచ్చేశారోచ్.. తెరపైకి గృహసారథులు!
X
  • త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 5.2 లక్షల మంది నియామకం
  • తెరపైకి గృహసారథులు, కన్వీనర్ల నియామకాలు
  • ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహసారథులు
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో ముగ్గురు పార్టీ కన్వీనర్లు
  • మొత్తంగా 45 వేలమంది నియామకం
  • డిసెంబరు 20 కల్లా కన్వీనర్ల నియామకం
  • రీజినల్‌ కో ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులతో పాటు..
  • నియోజకవర్గాల పరిశీలకులతో సమావేశంలో సీఎం వైఎస్ జగన్

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టారు. 2019 ఎన్నికల్లోనే అఖండ విజయం సాధించిన వైసీపీ..2024 ఎన్నికల్లో ఒక ప్రభంజనం సృష్టించాలని.. ఈ విజయం చరిత్ర తిరగరాసేలా ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందుకు కలిసి వచ్చే ప్రతీ అంశాన్ని చాలా చాకచక్యంగా ఉపయోగించుకుంటున్నారు. 175కు 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తన అమ్ములపొదిలోని ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ తాజాగా పార్టీలో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గృహ సారథులు, కన్వీనర్ల వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చింది. ఈ విషయాన్ని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల పార్టీ పరిశీలకులతో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. గడపగడపకూ పార్టీని తీసుకెళ్లేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు గృహసారథులు, కన్వీనర్ల వ్యవస్థను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రీజినల్‌ కో ఆర్డినేటర్లు, పార్టీ అధ్యక్షులకు, నియోజకవర్గ పరిశీలకులకు విధివిధానాలు నిర్దేశించారు. గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో మిగిలిన గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా చురుగ్గా పార్టీ కార్యక్రమాలు కొనసాగిచేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.66 కోట్ల కుటుంబాలను పార్టీ తరఫున కలుసుకునేందుకు ...50 కుటుంబాల వారీగా మ్యాపింగ్‌ చేసేందుకు ఈ కొత్త వ్యవస్థను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 20కల్లా గ్రామ/వార్డు సచివాలయ కన్వీనర్ల నియామకం పూర్తి చేయాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

ప్రతీ 50 ఇళ్లకు ఇద్దరు గృహసారథులు

'వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి యాభై ఇళ్లకు ఒక పురుషుడు, ఒక మహిళ– గృహసారథులుగా ఉంటారు. పార్టీ సందేశాన్ని చేరవేయడం, వారికి తయారుచేసిన పబ్లిసిటీ మెటరీయల్‌ను అందించడం తదితర కార్యక్రమాలు వీళ్లు చూస్తారు. అలాగే గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో కూడా పార్టీతరఫున ముగ్గురు కన్వీనర్లు ఉంటారు. వీరిలో కనీసం ఒక్కరు మహిళ ఉంటారు. వీరు సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ కార్యక్రమాలను చూస్తారు. రాజకీయ అవగాహన ఉన్నవారు, చురుగ్గా ఉన్నవారిని కన్వీనర్లుగా ఎంపికచేయాలి. మొత్తంగా యాభైఇళ్లకు ఇద్దరు చొప్పున 15వేల గ్రామాల్లో 5.2 లక్షల మంది గృహసారథులు ఉంటారు. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో 45 వేల మంది కన్వీనర్లు ఉంటారు.' అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

కన్వీనర్ల విధులు ఇవే

'రాష్ట్రంలోని దాదాపు 15వేల సచివాలయాలకు ముగ్గురు చొప్పున కన్వీనర్ల ఎంపికను ప్రారంభించాలి. ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు వీరిని ఎంపిక చేస్తారు. ఈ ప్రాసెస్‌ సక్రమంగా జరిగేలా నియోజకవర్గాల పరిశీలకులు చూస్తారు. ఎంపిక పూర్తైన తర్వాత ఈ సచివాలయాల పరిధిలోని పార్టీకి సంబంధించిన కన్వీనర్లు డోర్‌ టు డోర్‌ వెళ్లి పార్టీనుంచి సందేశాన్ని, పబ్లిసిటీ మెటీరియల్‌ని అందిస్తారు' అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. '15రోజుల వ్యవధిలో అన్ని కుటుంబాలను కలుసుకుంటారు. మొదటసారి ఇలా తిరగడం వల్ల ఆ సచివాలయాల పరిధిలో ఒక అవగాహన వస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరుగుతూనే.. మరోవైపు సచివాలయాలకు ఎంపిక చేసిన పార్టీ కన్వీనర్లు కూడా గడపగడపకూ తిరుగుతారు అని చెప్పుకొచ్చారు. అయితే కన్వీనర్లుగా నియమితులయ్యేవారు ఖచ్చితంగా స్థానికంగా నివసించిన వారై ఉండాలి. కన్వీకనర్ల ఎంపిక తర్వాత తదనంతరం ప్రతి యాభై ఇళ్ల క్లస్టర్‌కు ఇద్దరు చొప్పున గృహసారథులను ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గృహసారథులు కూడా అదే క్లస్టర్కు చెందినవారై ఉండాలి. సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లు, గృహ సారథుల పనితీరుపై నిరంతరం మదింపు ఉంటుంది. వీరందరికీ ఉచిత జీవిత బీమా ఉంటుంది. పార్టీ విస్తృతస్థాయి సమావేశాలకు వీరు ఆహ్వానితులుగా ఉంటారు. ఫలితంగా బూత్‌ కమిటీ నుంచి బలమైన నెట్‌వర్క్‌ ఏర్పాటు అవుతుంది. ఇది ఆలస్యం చేయకుండా డిసెంబర్‌20లోగా సచివాలయాల పరిధిలో కన్వీనర్ల నియామకం పూర్తయ్యేలా చూడాలి' అని ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు, రీజినల్ కో ఆర్డినేటర్లను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

92శాతం కుటుంబాలకు మేలు జరిగింది

'మన ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం కుటుంబాలకు మేలు జరిగింది. పట్టణ ప్రాంతాల్లో 84 శాతం కుటుంబాలకు మేలు జరిగింది. కార్పొరేషన్లలో 78 శాతం నుంచి 80 శాతం కుటుంబాలకు మేలు జరిగింది. సాధారణంగా రాజకీయనాయకులు తిరగడానికి భయపడతారు...కానీ మనం ధైర్యంగా తిరుగుతున్నాం. వైఎస్ఆర్ హయాంలో శాచ్యురేషన్‌ పద్ధతిలో పథకాలు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు అర్హత ఉన్న వారికి ఎవ్వరికీ కూడా నిరాకరించకుండా పథకాలు అమలు చేశాం. మూడున్నరేళ్లుగా ప్రతి కుటుంబానికీ మేలు జరిగింది. మన పార్టీ వల్ల మేలు జరిగిందన్న సంతోషం ఎమ్మెల్యేలకూ ఉంది.' అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

కష్టపడకపోతే ఫలితం ఉండదు

'బూత్ కమిటీ నుంచి బలమైన నెట్‌వర్క్‌ ఉండడం వల్ల గెలవటం అన్నది చాలా సులభం. ప్రతి ఎమ్మెల్యేను గెలిపించాలన్నదే పరిశీలకుల లక్ష్యం కావాలి. 175కి 175 గెలవాలి. బటన్నొక్కడమే కాదు..ఈనెట్‌వర్క్‌ మొత్తం చాలా బలంగా పనిచేయాలి. ఈ నెట్‌వర్క్‌ అంతా బలంగా పని చేయించాల్సిన బాధ్యత పార్టీ పరిశీలకులుగా మీ అందరి మీదా ఉంది. మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం ఉంటుంది. కష్టపడకపోతే ఫలితం ఉండదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలను గెలిపించాల్సిన బాధ్యత మీది. గెలిపించుకుని వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ నుంచి మీకు తప్పక గుర్తింపు ఉంటుంది. ఇది మీకు అవకాశమే కాదు ఒక బాధ్యత కూడా. పార్టీలో ఎక్కడైనా చిన్న చిన్న బేధాలు ఉంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత రీజనల్‌ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల పరిశీలకులపై ఉంది.' అని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

READ MORE

తెలంగాణ, ఏపీ మళ్లీ కలవడం అసాధ్యం: సజ్జలకు షర్మిల కౌంటర్

Next Story

Most Viewed