వియత్నాం పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష

by Naga Rani Yarlagadda |

వియత్నాం పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

వియత్నాం పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: వియత్నాం పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదంలో మరణించినవారిని, మిగతా బాధితులను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన మచిలీపట్నానికి చెందిన గెల్లి కిశోర్ కు ప్రస్తుతం వియత్నాం ఆస్పత్రిలోనే చికిత్స జరుగుతుండగా.. అందుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇదే ప్రమాదంలో అతని భార్య గెల్లి జయశ్రీ (50) మరణించారని తెలిసి దిగ్భ్రాంతి చెందారు. కాగా.. మృతదేహాలను స్వస్థలానికి తరలించేందుకు రాయబార కార్యాలయం ప్రత్యేక ఏజెన్సీని నియమించిందని, మృతదేహాల అప్పగింత, తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు వెల్లడించారు.

ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన ఇతర పర్యాటకులను ప్రత్యేక విమానాల ద్వారా తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. బాధితులకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ భవన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాల తరలింపు ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ సహకరించాలని. దీనిపై వియత్నాంలోని భారత ఎంబసీతో ఎప్పటికప్పుడు కో-ఆర్డినేట్ చేసుకోవాలని సీఎం సూచించారు. విహారయాత్ర విషాదంగా మారడంతో గెల్లి జయశ్రీ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురు, కొడుకు తో పాటు.. బంధువులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు.

Next Story