భూ సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-04 07:43:44  IST  )

రెవెన్యూ శాఖపై ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు.

భూ సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: రెవెన్యూ శాఖపై ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. ప్రజల భూ సమస్యలు, పరిష్కారం కోసమై అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై ఆయన అధికారులతో సమీక్షిస్తున్నారు. గత ఏడాది కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న భూమి సంబంధిత సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలపై ఆయన దృష్టి సారించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు, భూ సర్వేలలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన విమర్శించారు. ఈ భూ సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే మంత్రివర్గంలో బహుళ సందర్భాలలో చర్చలు జరిగాయి. అయినప్పటికీ.. రెవెన్యూ శాఖ చేపడుతున్న చర్యలపై సీఎం పూర్తి సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం. ప్రజల మధ్య ప్రభుత్వంపై సానుకూల భావన కల్పించడానికి భూ సమస్యలను వేగంగా పరిష్కరించడం, సేవలను సరళీకరించడం కీలకమని చంద్రబాబు భావిస్తున్నారు.

రెవెన్యూ శాఖలో గ్రామస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు సమూల మార్పులు జరగకపోతే ఆశించిన ఫలితాలు సాధ్యం కావని ఆయన అభిప్రాయపడ్డారు. తహసీల్దార్ కార్యాలయాల్లో లక్షల సంఖ్యలో ప్రజల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత, పని ఒత్తిడి వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. అంతేకాకుండా, సేవలను మరింత సరళీకృతం చేయడానికి టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతంగా పెంచే దిశగా చర్యలు తీసుకోనున్నారు. మహానాడు సమావేశంలో చంద్రబాబు ఒక సంవత్సరంలో భూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో రెవెన్యూ సమస్యలపై ముఖ్యమైన నిర్ణయాలు మరియు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story