ఏపీలో డ్రగ్స్ ప్రకంపనలు...సీఎం చంద్రబాబు ఆరా

by velandi.Saikiran |   (  Updated:2026-03-15 21:15:40  IST  )

టీడీపీ ఎంపీ ‘మొయినాబాద్‌’ ఉదంతంపై పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో డ్రగ్స్ ప్రకంపనలు...సీఎం చంద్రబాబు ఆరా
X

ఏపీలో డ్రగ్స్ ప్రకంపనలు

- టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ మెడకు ఉచ్చు

- ‘మొయినాబాద్‌’ ఉదంతంపై సీఎం చంద్రబాబు ఆరా

దిశ, ఏపీ బ్యూరో: హైదరాబాద్‌ నగర శివారులోని మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇందులో ఏపీకి చెందిన టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ యాదవ్‌ పేరు బయటకు రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రధానంగా చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన వేళ టీడీపీ ఎంపీ ఈ వ్యవహారంలో చిక్కుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ కేసుల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని, నేతల తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని తేల్చిచెప్పారు. ఎంపీ పుట్టా మహేశ్‌పై ఆరోపణలను చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. డ్రగ్స్‌ వ్యవహారంపై ఐదు రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నేను ఏ తప్పూ చేయలేదు: ఎంపీ పుట్టా మహేశ్‌

‘నేను ఎక్కడా తప్పు చేయలేదు. ఎన్నో రోజులు నుంచి నన్ను కలవాలని అక్కడి మిత్రులు పిలవడంతో డిన్నర్‌కు వెళ్లాను. అక్కడ నేను తప్పు చేయలేదు. ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయను. మీడియాతో పాటు సోషల్‌మీడియాలో వచ్చే కథనాలు నమ్మొద్దు. నేనెప్పుడూ నిజాలే చెబుతా.’ అంటూ డ్రగ్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

Next Story