గుంటూరు ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

by Malleboina Mahesh |   (  Updated:2026-07-18 06:01:44  IST  )

గుంటూరులో మహిళపై దాడి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. నిందితుడి అరెస్ట్, సదరు పార్టీ నేత సస్పెన్షన్.. మహిళల భద్రతపై రాజీపడేదే లేదని స్పష్టీకరణ!

గుంటూరు ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో మహిళ పట్ల జరిగిన ఒక అమానుష ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) అత్యంత తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న ఆయన.. నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ ఉదంతంపై సీఎం చంద్రబాబు ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ.. "గుంటూరులో జరిగిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఏ మహిళను అవమానించినా అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు, మన సమాజంలో దానికి చోటు లేదు. ఈ ఘటనపై తక్షణమే అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను ఆదేశించాను.

ఇప్పటికే దీనిపై క్రిమినల్ కేసు నమోదైంది. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈ ఘటనతో సంబంధం ఉన్న పార్టీ పదాధికారిని (ఫంక్షనరీ) జనరల్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతోంది" అని ప్రకటించారు. అలాగే రాజకీయ పార్టీలతో అనుబంధం ఉందనే కారణంతో ఏ ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఎలాంటి రక్షణ లభించదని చంద్రబాబు కరాఖండిగా తేల్చి చెప్పారు. ఎటువంటి భయం, పక్షపాతం లేకుండా చట్టాన్ని నిష్పక్షపాతంగా, పకడ్బందీగా అమలు చేయడమే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మహిళకు తమ గౌరవానికి, భద్రతకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే పూర్తి నమ్మకం, ధీమా ఉండాలని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

గుంటూరులో ఘోరం.. మహిళను వివస్త్రను చేసి దాడి

Next Story