పత్తి, మొక్కజొన్న, అరటి రైతులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

పత్తి, మొక్కజొన్న, అరటి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు..

పత్తి, మొక్కజొన్న, అరటి రైతులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమలో పండిన అరటిని ముంబై లాంటి మార్కెట్‌లకు తరలించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ముంబై, కలకత్తా లాంటి ప్రాంతాలకు తరలించి అక్కడి మార్కెట్లలో విక్రయించాలని సూచించారు. అరటి ధరలు, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. అరటి ధరలు, కొనుగోళ్లపై ప్రతీ రోజూ వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు అరటి లోడుతో కూడిన రైల్వే వ్యాగన్లను పంపేందుకు చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం రాయలసీమలో 40 వేల హెక్టార్లలో అరటి ఉత్పత్తి అవుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డిసెంబరు మొదటి వారం నుంచి అరటి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే అప్పటి వరకూ అరటి రైతులు నష్టపోకుండా తక్షణం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

రాయలసీమలో పండిన అరటిని రవాణా చేసేందుకు ఓ ఏజెన్సీ ముందుకు వచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎప్పటికప్పుడు అరటిని రవాణా చేసేందుకు ఓ ప్రణాళికను రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. మొక్క జొన్న రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలిచ్చారు. మొక్క జొన్న మద్ధతు ధర కంటే తక్కువ రేటు పలుతున్నందున వ్యత్యాసాన్ని ధరల స్థిరీకరణ నిధి ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఈసారి 1.42 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైందని 8.18 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 2.04 లక్షల మెట్రిక్ టన్నుల మొక్క జొన్నను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయించేందుకు ప్రయోగాత్మకంగా కొనుగోళ్లు చేపట్టాలని పేర్కొన్నారు. అది సత్ఫలితాలు ఇస్తే మొక్క జొన్న కొనుగోళ్లకు సమస్య ఎదురైనప్పుడు దానిని ఆచరించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

పత్తి కొనుగోళ్లపై కేంద్రానికి లేఖ..

పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రతీ రోజూ తనిఖీ చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. రంగుమారిన, తడిచిన పత్తిని కూడా కొనుగోలు చేసేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాగల రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయాల్సిందిగా సీఎం అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్లాట్ బుకింగ్ సమస్యను పరిష్కరించిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సమీపంలోని జిన్నింగ్ మిల్లులకే పత్తిని రవాణా చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తేమ శాతం లాంటి సీసీఐ నిబంధనల కారణంగా పత్తి రైతులు నష్టపోకుండా చూడాలని సీఎం వారికి సూచించారు.

Next Story