- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతి స్పీడప్: 'బ్యాంక్ స్ట్రీట్'పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రాజధానిలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు...

దిశ, ఏపీ బ్యూరో: రాజధానిలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఫోన్, కేబుల్, ఇంటర్నెట్ కనెక్టివిటీలకు సంబంధించి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రాజధాని అమరావతి నగరంలో పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వసతులను ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశించారు. అమరావతిని నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా.. నివాస వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పైప్డ్ గ్యాస్ కనెక్షన్తో పాటు , ఇండక్షన్ స్టవ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, డిస్ట్రిక్ట్ కూలింగ్ వంటి వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చెప్పారు.
జాప్యం చేయొద్దు
అమరావతి బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాల అంశంపై చర్చించారు. బ్యాంకు కార్యాలయాల నిర్మాణాలకు సీఆర్డీఏ వైపు నుంచి పూర్తి సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. బ్యాంక్ స్ట్రీట్లో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన 13 బ్యాంకుల్లో 11 సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణ బాధ్యతలను సీపీడబ్ల్యూడీకు అప్పగించారని అధికారులు సీఎంకు వివరించారు. పూర్తి సమన్వయంతో త్వరితగతిన ఈ నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూడాలని సీఆర్డీఏ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాజధాని ప్రాంతంలో సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వరకు ఏడాది పొడవునా నీళ్లు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. పర్యాటక అభివృద్ధికి జల క్రీడలు, స్విమ్మింగ్ తదితర కార్యకలాపాలకు పెద్ద ఎత్తున అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అథారిటీ సమావేశంలో కృష్ణా కరకట్ట నిర్మాణ పనులు, ఉండవల్లి గ్రామంలో ఎల్పీఎస్ లే అవుట్ల అభివృద్ధి, పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, జ్యూడిషియల్ అకాడెమీ నిర్మాణం, పౌల్ట్రీ ఫారంల స్ట్రక్చర్లకు చెల్లించాల్సిన పరిహరం వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ వర్చువల్ గా పాల్గొన్నారు. సమావేశంలో మున్సిపల్, సీఆర్టీఏకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






