జగన్ జేబు సంస్థలా మారిపోయిన సీఐడీ: కన్నా లక్ష్మీనారాయణ

by Disha Web Desk 21 |
జగన్ జేబు సంస్థలా మారిపోయిన సీఐడీ: కన్నా లక్ష్మీనారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని జైలుకి పంపాలన్నది జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల కల అని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ అనేది ప్రధాని నరేంద్రమోడీకి ఎంతో ఇష్టమైంది. అందుకే గుజరాత్ సహా అనేక రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు అని చెప్పుకొచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం ఉన్నవారంతా స్కిల్ డెవలప్‌మెంట్‌ను పలు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు అని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కింద 2 లక్షలమందికి పైగా శిక్షణ ఇచ్చి లక్షమందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ స్కీమ్ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారని జగన్ ప్రభుత్వం ప్రసంశించింది అని గుర్తు చేశారు. సిమెన్స్ కేసులో పలువురికి హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది అని వ్యాఖ్యానించారు. తాను జైలుకు వెళ్లాడు కాబట్టి చంద్రబాబు సహా అనేకమంది నేతలను బెయిల్ మీద ఉన్న వారిగా చేయాలని జగన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఇందుకు సీఐడీని ఎన్నుకున్నాడు. ఈ సీఐడీ వైసీపీ జేబు సంస్థగా పనిచేస్తోంది అని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేయించి వీడియో కాల్‌లో అది చూసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు.

రాష్ట్ర సంపదను ఏకీకృతం చేసుకుని తానొక్కడే సంపాదించుకుంటూ పోలీసులను పహారా పెట్టుకున్నాడు అని మండిపడ్డారు. రిమాండ్ రిపోర్టులో కట్టు కథలు అల్లారు. లండన్ నుంచి వచ్చేసరికి సీఎం కళ్లలో ఆనందం చూడాలని ఆత్రుత తప్పా ఆ రిమాండ్ రిపోర్టులో ఏం లేదు అని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. మరోవైపు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ వ్యాఖ్యలను కూడా వక్రీకరించారన్నారు. రోజువారీ కార్యక్రమాల్లో ఎండీలదే పాత్ర అన్నారు. న్యాయవ్యవస్థ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. గురివింద తీరుగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. కొండంత అవినీతిని చేసి తాను అవినీతికి తావు ఇవ్వనని జగన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. యువత భవిష్యత్‌కు బాట వేసిన వ్యక్తి చంద్రబాబు ఆయన చేసి ఐటీ అభివృద్ధి వల్లే దేశవిదేశాల్లో యువత పనిచేసుకుంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి ఏం చేశాడు? అని కన్నా లక్ష్మీనారాయణ నిలదీశారు. సీఐడిని ఉపయోగించకుని చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి సైకో ఆనందం పొందుతున్నారు. జగన్ లండన్ వెళ్లడం, ఆయన వచ్చేసరికి చంద్రబాబు జైల్లో అండాలని ఆదేశాలివ్వడం, సీఐడీ అందుకు తగ్గట్టు పనిచేయడం చూశాం. జగన్ రెడ్డిలాంటి రాక్షసులను తరిమికొడదాం అని కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed