Ugadi Asthanam: శ్రీవారి ఆలయంలో ఘనంగా ఉగాది ఆస్థానం

by Disha Web Desk 16 |
Ugadi Asthanam: శ్రీవారి ఆలయంలో ఘనంగా ఉగాది ఆస్థానం
X

దిశ, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ శోభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుక ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశింపజేశారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వ‌ద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, జెఈవో సదా భార్గవి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజివో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ప్రత్యేక ఆకర్షణగా ఫల - పుష్ప ఆకృతులు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయంలో ఆపిల్‌, ద్రాక్ష, బత్తాయి, సపోటా, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంభం చెంత ఎండు కొబ్బరితో దశావతారాలు, కొబ్బరిపూలతో చేసిన శ్రీలంక ఆర్ట్‌ అలంక‌ర‌ణ‌లు, పుచ్చకాయలతో చెక్కిన శ్రీప‌ద్మావ‌తి, శ్రీ‌నివాసుల క‌ల్యాణఘ‌ట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇవి కూడా చదవండి : 2023-24 టీటీడీ బడ్జెట్ ఇదే...!

Next Story

Most Viewed