రామకృష్ణ తీర్థ ముక్కోటికి.. వారికి అనుమతి నిరాకరణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-28 14:35:32  IST  )

తిరుమలలో రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు...

రామకృష్ణ తీర్థ ముక్కోటికి.. వారికి అనుమతి నిరాకరణ
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో ఫిబ్రవరి 1న జరగనున్న రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పద్మావతి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో ఒకటైన రామకృష్ణతీర్థ ముక్కోటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను వెంకయ్య చౌదరి ఆదేశించారు. భక్తుల కోసం షామియానా, రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. టీటీడీ భద్రతాసిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం భద్రత, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పాపవినాశనం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి అవసరమైన శ్రీవారి సేవకులను నియమించాలని వెంకయ్య చౌదరి కోరారు.

అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, చిన్న పిల్లలను అనుమతించబోమని వెంకయ్య చౌదరి తెలిపారు పాపవినాశనం వద్ద భక్తులను మెడికల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే తీర్థానికి అనుమతించాలని చెప్పారు. భక్తులకు అత్యవసర పరిస్థితిలో చికిత్స అందించేందుకు రెండు అంబులెన్సులు, 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను ఫిబ్రవరి 1వ తేదిన పాపవినాశనానికి అనుమతించని కారణంగా గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ఎస్ఆర్టీసీ నుండి బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతించనున్నట్లు సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు.

Next Story