Tirumala: మార్చి 21, 22న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

by Disha Web Desk 16 |
Tirumala: మార్చి 21, 22న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్థి నిర్వహిస్తారని స్పష్టం చేసింది. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి, విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారని... ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారని ఓ ప్రకటనలో తెలిపింది. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింప చేస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారని స్పష్టం చేసింది.

ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని పేర్కొంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 22న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాల‌ను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే మార్చి 21, 22న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుమల శ్రీ‌వారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వహించ‌నున్నట్లు వెల్లడించింది.

ఈ సందర్భంగా మార్చి 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్ ద‌ర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.

Next Story