వివేక హత్య కేసుపై Somu Veerraju ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
వివేక హత్య కేసుపై Somu Veerraju ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ హత్య కేసులో కేంద్రం ఎవరినీ కాపాడే ప్రయత్నం కూడా చేయబోదని స్పష్టం చేశారు. ఈ హత్య కేసు నుంచి బయటపడేందుకే సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మండిపడ్డారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇందులో కేంద్రం ప్రమేయం ఉండబోదని చెప్పారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో పర్యటిస్తున్న సోము వీర్రాజు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వనరులను టీడీపీ, వైసీపీలు దోచేస్తున్నాయని 60:40 అంటూ సంపదను దోచుకుంటున్నాయని ఆరోపించారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి నేడు వైసీపీ పాలనలో కూడా జరుగుతుందన్నారు. ఇరు పార్టీలకు సహకరించకుండా పోరాటం చేస్తే వేయి కోట్లు ప్యాకేజీ అంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. బ్లాక్ మెయిల్‌కు బీజేపీ చరమగీతం పాడటం ఖాయమన్నారు. చైనాను లొంగదీసుకున్న బీజేపీకి వీళ్లంతా ఒక లెక్కా అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం వాళ్లు వైసీపీ ఏజెంట్లు అంటే వైసీపీ వాళ్ళు టీడీపీ ఏజెంట్లు అంటూ బీజేపీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రనిధులతో మాత్రమే జరుగుతుందని సోము వీర్రాజు తెలిపారు. కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోతే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్రఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ వద్ద ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఈ బడ్జెట్‌లో అత్యధిక నిధులు ఏపీకి కేంద్రం అందిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60 పథకాలు కేంద్ర ప్రభుత్వానివేని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేవలం బీజేపీకే ఉందని సోము వీర్రాజు పేర్కొన్నారు.

జనసేన మద్దతు

2019 ఎన్నికల అనంతరం జరిగిన పలు ఉపఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్లతో గెలిచిందని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆరోపించారు. బస్సులతో దొంగ ఓటర్లను తీసుకువచ్చి మరీ గెలిచారన్నారు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 10వ తరగతి పాసైన వారికి సైతం దొడ్డిదారిలో ఓటు హక్కు కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ రెడ్డిని ఎంపిక చేస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం బీఫార్మ్ ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు జనసేన మద్దతు ఉంటుందని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed