ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న జపాన్‌ దిగ్గజం 'ప్రొటీరియల్‌'

by Ramesh Naini |   (  Updated:2026-02-27 11:32:55  IST  )

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ప్రొటీరియల్‌' (Proterial) ముందుకు వచ్చింది.

ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న జపాన్‌ దిగ్గజం ప్రొటీరియల్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ప్రొటీరియల్‌' (Proterial) ముందుకు వచ్చింది. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో అత్యాధునిక ఎలక్ట్రికల్‌ స్టీల్‌ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అమెరికా-జపాన్‌ సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ సంస్థ, 'మెట్‌గ్లాస్‌ ఇండియా' పేరుతో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది.

77 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి

ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా ప్రొటీరియల్‌ సంస్థ సుమారు 77 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 640 కోట్లకు పైగా) పెట్టుబడిని పెట్టనుంది. ఈ ప్లాంట్‌లో ప్రధానంగా విద్యుత్ రంగంలో కీలకమైన అల్లాయ్‌ రిబ్బన్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ప్రారంభ దశలో ఏడాదికి 30 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ యూనిట్‌ పనిచేస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

స్థానిక యువతకు జపాన్‌లో శిక్షణ

ఈ పరిశ్రమ ద్వారా సుమారు 200 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా స్థానిక యువతకు ఈ ప్లాంట్‌లో ప్రాధాన్యత కల్పిస్తామని సంస్థ సీఈవో శాన్‌స్టాక్ స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు జపాన్‌లోని తమ మాతృ సంస్థలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

2026 అక్టోబర్‌ నుంచి ఉత్పత్తి

అత్యాధునిక జపాన్‌ సాంకేతికతతో నిర్మితం కానున్న ఈ కర్మాగారం నిర్మాణ పనులను వేగవంతం చేసి, 2026 అక్టోబర్‌ నాటికి వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీసిటీలో ఈ ప్లాంట్ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కావడమే కాకుండా, అనుబంధ పరిశ్రమలకు కూడా భరోసా లభించనుంది.

Next Story