Tirumala: రెట్టింపుగా భక్తులు.. శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం

by Disha Web Desk 16 |
Tirumala: రెట్టింపుగా భక్తులు.. శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం
X

దిశ, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుంచి భక్తులతో తిరుమల క్షేత్రం పోటెత్తింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు, తాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు.


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే మధ్యాహ్నానికి దాదాపు 79 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 80 వేల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్న ప్రసాదాలు అందించారు. అంతే కాకుండా పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 50 వేల మంది యాత్రికులు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.

భక్తుల అధిక రద్దీ కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు, జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Next Story

Most Viewed