నేడు చిత్తూరులో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

by Dishanational2 |
నేడు చిత్తూరులో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
X

దిశ, తిరుపతి: చిత్తూరులో గురువారం ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తిరుపతిలోని 229, 233 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 46.39% శాతం పోలింగ్ నమోదయింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 16 న గురువారం చిత్తూరు ఆర్‌వీఎస్ లా కాలేజ్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు, ఇంజినీరింగ్ కళాశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది.ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరి నారాయణ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు బుధవారం సాయంత్రం నాటికి ఏర్పాట్లను పూర్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి కూడా ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌కు 40 టేబుల్స్

పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం 40 టేబుల్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో 193 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 551 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 172 మంది మైక్రో అబ్జర్వర్లు మొత్తం 916 మంది సిబ్బంది పాల్గొననున్నారు.


Next Story

Most Viewed