రేపు ముంబై వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

by Ramesh Naini |   (  Updated:2026-04-24 07:31:07  IST  )

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) ముంబై పర్యటనకు వెళ్లనున్నారు.

రేపు ముంబై వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. ప్రముఖ వాణిజ్య పత్రిక ‘ఎకనామిక్‌ టైమ్స్‌’ ప్రకటించిన ప్రతిష్టాత్మక (Business Reformer of the Year) ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును ఆయన ఈ పర్యటనలో అందుకోనున్నారు. ముంబై వేదికగా రేపు ఎకనమిక్‌ టైమ్స్‌ 26వ కార్పొరేట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాగా, సీఎం చంద్రబాబును కేవలం అవార్డు గ్రహీతగానే కాకుండా, ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా (గెస్ట్ ఆఫ్ ఆనర్) కూడా ఎకనమిక్‌ టైమ్స్‌ యాజమాన్యం ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం.

పరిపాలనలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు వరించింది. దేశ ఆర్థిక, పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు కార్పొరేట్‌ రంగ ప్రముఖులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

Next Story