మాజీ సీఎం జగన్ ను కలిసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

by Thanuru Gopichand |

వైసీపీ శ్రేణులకు అండగా ఉంటానని భరోసానిచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి.

మాజీ సీఎం జగన్ ను కలిసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (YS Jagan Mohan Reddy) ఆ పార్టీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. మద్యం అక్రమ కేసులో సుమారు 226 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన చెవిరెడ్డి గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్న ఆయన, తనపై ప్రభుత్వం మోపిన కేసులు, జైలులో ఎదుర్కొన్న పరిస్థితులను వైఎస్ జగన్ కు వివరించారు. ముఖ్యంగా తన కుమారులైన మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను సైతం ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్ తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. న్యాయస్థానాల ద్వారా చట్టపరంగా అన్నింటినీ ఎదుర్కొందామని ధైర్యన్ని ఇచ్చారు.

ప్రజల పక్షాన పోరాడే క్రమంలో ఇటువంటి రాజకీయ వేధింపులు సహజమని పేర్కొన్నారు. వీటిని ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా సూచించారు. పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇటువంటి ఇబ్బందుల పట్ల ఆందోళన చెందవద్దన్నారు. అందరికీ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చెవిరెడ్డి కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి కూడా పాల్గొని జగన్‌తో మాట్లాడారు. చెవిరెడ్డికి బెయిల్ లభించి విడుదల కావడంతో నియోజకవర్గవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చట్టంపై తమకు నమ్మకం ఉందని, త్వరలోనే అన్ని కేసుల నుంచి క్లీన్ చిట్‌తో బయటకు వస్తామని చెవిరెడ్డి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Next Story