బోటు మనదే.. వేట మనదే.. ఇక్కడ వేటకొస్తే వెంటాడతాం : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ తీరంలోకి బయటి మత్స్యకారులు వేటకొస్తే.. వారివెంటపడి శిక్షిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

బోటు మనదే.. వేట మనదే.. ఇక్కడ వేటకొస్తే వెంటాడతాం : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ తీరంలోకి బయటి మత్స్యకారులు వేటకొస్తే.. వారివెంటపడి శిక్షిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం నెల్లూరు జిల్లా కావలిలో తుమ్మలపెంట వేదికగా.. మత్స్యకారుల సేవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆసరాగా ఉండేందుకు.. ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20 వేల చొప్పున 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చే సాయంలో ఒక్కపైసా కూడా పెంచలేదని విమర్శించారు. కూటమి సర్కార్ మత్స్యకారులకు ఇచ్చే సహాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిందన్నారు. మత్స్యకారుల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రూ.3256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మన రాష్ట్ర తీరంపై వేటాడే హక్కులు పూర్తిగా మనకే ఉన్నాయన్నారు. బోటు మనదే.. వేట మనదే.. ఇతరలు వస్తే వెంటాడుతాం.. అని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల బోట్లు మన తీరంవైపు వస్తే శాటిలైట్ ద్వారా గుర్తించి వెనక్కి పంపుతామన్నారు.

ఇక జువ్వలదిన్నె హార్బర్ త్వరలోనే పూర్తవుతుందని, దానిపై చేస్తున్న దుష్ర్పచారాన్ని నమ్మొద్దని సీఎం కోరారు. ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. చేపలు మంచి ప్రొటీన్ ఫుడ్ అని, చేపలు తింటే డయాబెటీస్ రాదని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. మత్స్యకారుల చేపల ఉత్పత్తులకు తానే మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తానన్నారు.

కృష్ణా నదిలో బోట్లతో మత్స్యకారుల భారీ ర్యాలీ

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు రూ.20 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. మత్స్యకారులు కృష్ణానదిలో బోట్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వరుసగా రెండోఏడాది మత్స్యకారుల సేవలో పథకం కింద నిధులు విడుదల చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. వేట నిషేధ సమయంలో ఇబ్బందులు పడకుండా.. ఒక్కొ మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

Next Story