చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ల జోడీ బ్లాక్‌ బస్టర్‌: నారా లోకేశ్

by Disha Web Desk 21 |
చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ల జోడీ బ్లాక్‌ బస్టర్‌: నారా లోకేశ్
X

దిశ,డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ల జోడీ బ్లాక్‌బస్టర్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా తుని ఎస్. అన్నవరం సాయివేదిక వద్ద కాపు సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో నారా లోకేశ్ మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేతో కుమ్మక్కై అవినీతికి పాల్పడిన అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగులను డిస్మిస్‌ చేసి జైలుకు పంపుతామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్‌ ద్వారా కాపులను పేదరికం నుంచి బయటపడేలా చేస్తానని భరోసా ఇచ్చారు.‘కాపు రిజర్వేషన్ల కోసం మంత్రి దాడిశెట్టి రాజాను నిలదీయండి. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి 5 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉంది. కాకినాడ సెజ్‌లో కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తాం’అని నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.

జగన్ కాపుల రిజర్వేషన్లు రద్దు చేశాడు

కాపులకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు జగన్ రద్దు చేసాడు అని నారా లోకేశ్ ఆరోపించారు. కాపులకు కష్టపడే తత్వం ఉంది. మీరు కష్టాన్ని నమ్ముకున్న వారు. దాహంగా ఉంది మంచి నీరు ఇవ్వండి అంటే చల్లటి మజ్జిగ ఇచ్చి పంపే గొప్ప గుణం ఉన్న వారు కాపు సోదరులు అని చెప్పుకొచ్చారు. సామాజిక సేవలో ముందు ఉండేది కాపులు మాత్రమేనని అన్నారు. కాపులను ఆర్థికంగానూ, రాజకీయం లోనూ ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. కాపులకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంది చంద్రబాబు అని, కాపులకు కార్పొరేషన్ పెట్టింది టీడీపీయేనని చెప్పుకొచ్చారు. రూ.3 వేల కోట్లు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. కాపు విద్యార్థులకు విదేశీ విద్య పథకం ద్వారా రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల ఆర్ధిక సాయం అందించింది చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రూ.18 వేలు ఆర్ధిక సాయం అందించింది టీడీపీయేనన్నారు. కాపులకు కీలక పదవులు ఇచ్చింది....బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని చెప్పుకొచ్చారు. జగన్ కాపులను నమ్మించి ద్రోహం చేశాడని లోకేశ్ మండిపడ్డారు. కార్పొరేషన్ కి ఏడాదికి 2 వేల కోట్లు 5 ఏళ్లలో 10 వేల కోట్లు అన్నాడు. ఐదేళ్లలో కనీసం కార్పొరేషన్ ద్వారా 10 రూపాయిలు ఇవ్వలేదు. జగన్ కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసాడు. జగన్ కాపుల రిజర్వేషన్లు రద్దు చేశారని ఆరోపించారు.

మూడు నెలల్లో సైకో ప్రభుత్వం పోతుంది

తుని ఎమ్మెల్యే మాయా రాజా కాపులకు అన్యాయం జరుగుతున్నా ఏనాడూ జగన్‌ని ప్రశ్నించలేదు అని నారా లోకేశ్ ఆరోపించారు. జగన్ విదేశీ విద్య రద్దు చేసాడు. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి ఇచ్చే ఆర్ధిక సాయాన్ని కూడా రద్దు చేసాడు. కాపుల కోసం కాపు భవనాలు, కళ్యాణ మండపాలు కట్టింది టీడీపీయేనన్నారు. జిల్లా స్థాయిలో 5 కోట్లు, నియోజకవర్గం స్థాయిలో 1 కోటి రూపాయలతో కాపు భవనాలు ఏర్పాటు చేసింది టీడీపీ కాదా అని నిలదీశారు.టీడీపీ - జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే దామాషా ప్రకారం కాపు భవనాలు, కళ్యాణ మండపాలు ఏర్పాటు చేస్తాం అని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. మంత్రి దాడిశెట్టి రాజా ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. జర్నలిస్ట్ హత్య, శేషగిరి పై దాడి, అక్రమాలు పై సీబీఐ కేసు వేసి శిక్ష పడేలా చేస్తాం అని చెప్పుకొచ్చారు. తునిలో జరిగిన భూ దందా, ఇసుక అక్రమాలు, అవినీతి పై విచారణ జరిపి వడ్డీతో సహా మాయా రాజా తో కట్టిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నాడని... మూడు నెలల్లో సైకో ప్రభుత్వం పోతుందని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed