సంక్షోభాలను అవకాశంగా మార్చుకునే శక్తివంతమైన నాయకుడు చంద్రబాబు : ఐటీ ఉద్యోగులతో నారా బ్రహ్మణి

by Disha Web Desk 21 |
సంక్షోభాలను అవకాశంగా మార్చుకునే శక్తివంతమైన నాయకుడు చంద్రబాబు : ఐటీ ఉద్యోగులతో నారా బ్రహ్మణి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఐటీ ఉద్యోగులు పిలుపు ఇచ్చిన చలో రాజమండ్రి విజయవంతం అయ్యింది. ఐటీ ఉద్యోగులు రాష్ట్రంలో అడుగుపెట్టరాదంటూ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. టోల్‌గేట్, చెక్ పోస్టుల వద్ద భారీగా తనిఖీలు చేపట్టింది. అయినప్పటికీ ఐటీ ఉద్యోగులు మాత్రం వెనకడుగు వేయలేదు. పోలీసుల కళ్లుగప్పి రాజమండ్రికి తరలివచ్చారు. హైదరాబాద్‌లో వివిధ కంపెనీల్లో పని చేస్తోన్న ఐటీ రంగ ఉద్యోగులు నారా బ్రహ్మణిని కలిశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు పూర్తిగా అక్రమమని, ఒక విజనరీ లీడర్ ను జైలులో పెట్టడం చాలా బాధ కలిగిస్తోందని వారు అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ ఐటీ రంగ ఉన్నతికి ఎంతో కృషి చేసి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు నాయుడు అరెస్టు కక్ష పూరిత చర్య అని ఐటీ ఉద్యోగులు అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని.....తెలుగు జాతి కోసం, యువత కోసం నిత్యం శ్రమించిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న తాము రాజమహేంద్రవరం వస్తుంటే ఏపీ పోలీసులు అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టారని తెలిపారు. సొంత రాష్ట్రానికి వస్తుంటే అడ్డంకులు, కేసులు పెడతాం అనే బెదిరింపులు ఏంటో అర్థం కావడం లేదని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫోన్లు కూడా పోలీసులు తీసుకున్నారని..వాట్సాప్ చాటింగ్ కూడా చెక్ చేశారని హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ హోటల్ రూంలో దిగితే పోలీసులు వచ్చి తమను రూంలో పెట్టి తాళాలు వేశారని..అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదని అన్నారు. సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు చేసిన కృషిని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. 25 ఏళ్ల క్రితం రాళ్లు, రప్పలతో ఉన్న ప్రాంతం నేడు ఈ స్థాయిలో అభివృద్ది చెంది లక్షల మందికి ఉపాధినిచ్చే కేంద్రంగా మారడం వెనుక ఉన్న చంద్రబాబు కృషిని ఎవరూ చెరిపివేయలేరని ఉద్యోగులు నారా బ్రహ్మణితో చెప్పారు.

ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణం : బ్రహ్మణి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా తమకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణం అని నారా బ్రహ్మణి అన్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనదారుల ఫోన్ లు చెక్ చేయడం, వారి చాట్ లు పరిశీలించడం షాక్ కు గురిచేసింది అన్నారు. పోలీసుల చర్య వ్యక్తిగత గోప్యత హక్కును హరించడమే అన్నారు. సామాన్య ప్రజల ఫోన్‌లు చెక్ చేసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అసలు ఏ కారణంతో, హక్కుతో ఉద్యోగుల రాకపై ఆంక్షలు పెట్టారో చెప్పాలని బ్రహ్మణి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని బ్రహ్మణి అన్నారు. చంద్రబాబు కు సంఘీభావం తెలిపేందుకు అనేక వ్యయ ప్రయాసలు ఓర్చి, ప్రభుత్వ నిర్భందాలను దాటుకుని వచ్చిన ఉద్యోగులను చూసి తాను గర్వ పడుతున్నా అని బ్రహ్మణి వారికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఈ కష్ట సమయాన్ని అధికమిస్తారని...సంక్షోభాలను అవకాశంగా మార్చుకునే శక్తివంతమైన నాయకుడు ఆయన అని అన్నారు. యువత అంతా తమ ఓట్లు చెక్ చేసుకోవాలని...రానున్న రోజుల్లో ఓటు హక్కుతో ఈ ప్రభుత్వానికి బుద్దిచెప్పాలని కోరారు. ఆన్ లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు...అక్రమంగా ఎవరూ తమ ఓట్లు తొలగించకుండా ప్రజలను చైతన్య పరిచే బాధ్యత తీసుకోవాలని తనను కలిసిన ఉద్యోగులను బ్రహ్మణి కోరారు.



Next Story

Most Viewed