వేడెక్కిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు..ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాల్

by Disha Web Desk 3 |
వేడెక్కిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు..ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాల్
X

దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ‌నియోజకవర్గంలలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతిపరుడని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచారు. ఇక మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలపై ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి స్పందించారు.

తాను అవినీతికి పాల్పడివుంటే నిరూపించమని సవాల్ విసిరారు. సూర్యనారాయణరెడ్డి సవాల్ ను నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వీకరించారు. దీనితో ఇరువురు నేతలు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల సవాల్-ప్రతి సవాల్‌తో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరువురు నేతల బహిరంగ చర్చ.. అనపర్తిలో ఎలాంటి పరిణామాలకు దారితీయనుందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

కాగా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద బహిరంగ చర్చకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. అయినా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద బహిరంగ చర్చకు సంబంధించిన ఏర్పాట్లు ఆగడంలేదు. అలానే అనపర్తి మండలం రామవరంలో ‘ఛలో అనపర్తి’కి వెళ్లడానికి రామకృష్ణారెడ్డి సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ 50 మంది పోలీసులు మొహరించారు. అలానే రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ కి రంగం సిద్ధం చేశారు. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Next Story

Most Viewed