సొంతడొప్పుకొట్టుకోవడానికి కేంద్రం నిరాకరణ: జగన్ నిర్వాకంతో నిలిచిపోయిన గ్రాంట్స్

by Disha Web Desk 21 |
సొంతడొప్పుకొట్టుకోవడానికి కేంద్రం నిరాకరణ: జగన్ నిర్వాకంతో నిలిచిపోయిన గ్రాంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను అవినీతి, దుబారా కార్యక్రమాలకు దారిమళ్ళించి జగన్ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. 94కు పైగా కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయకపోవడంతో నాలుగేళ్లలో వేలకోట్ల రూపాయలు రాష్ట్రం కోల్పోయిందని అని చెప్పుకొచ్చారు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి దూరమయ్యాయన్నారు. వ్యవసాయం నుండి ఆరోగ్యశాఖ వరకు, పరిశ్రమల నుండి సాగునీటి ప్రాజెక్టుల వరకు ఇలా ప్రతి రంగానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులన్నింటినీ దారిమళ్లించడమే ఎజెండాగా జగన్ రెడ్డి కుటిల పాలన కొనసాగిస్తున్నారు అని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో రూ.71,449 కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే దారిమళ్ళించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు అని ధ్వజమెత్తారు. ఎడాపెడా ప్రజలపై భారాలు వేయడం, ఆస్తులు అమ్మేయడం, అధిక వడ్డీలకు అప్పులు తేవడం తప్ప అభివృద్ధి, సంక్షేమం అనే ఊసే లేకుండా జగన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు విరుచుకుపడ్డారు.

వ్యక్తిగత ప్రచారం కోసం రాష్ట్రానికి ద్రోహం

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో విద్య, వైద్య రంగాలు, పింఛన్లు, వ్యవసాయానికి సంబంధించి అనేక పథకాలు అమలవుతున్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు జగన్ ప్రభుత్వం చేసిన కుట్రలకు రాష్ట్ర ప్రజలు బలవుతున్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రతి ప్రభుత్వ పథకం ముందు జగన్, వైఎస్ఆర్ పేర్లు చేర్చడాన్ని కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేసినా తీరు మార్చుకోకపోవడంతో రూ.6 వేల కోట్ల నిధులను నిలిపేశారు అని స్పష్టం చేశారు. ఇందుకు జగన్‍రెడ్డి బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యక్తిగత ప్రచారానికి ప్రజాధనాన్ని జగన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారు అని విరుచుకుపడ్డారు. 75 పథకాలకు జగన్, వైఎస్ఆర్ పేర్లు పెట్టుకోవడం రాచరిక పోకడలకు నిదర్శనం కాదా? మూలధన వ్యయం కోసం రావలసిన రూ.4 వేల కోట్లు నిలిచిపోవడానికి జగన్ రెడ్డే బాధ్యుడు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

కరవు సాయం కూడా దోచేస్తే ఎలా?

మరోవైపు పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3,084 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించింది అని ఆరోపించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న హామీని జగన్ ప్రభుత్వం అమలు చేయకుండా కేంద్రం ఇళ్ల నిర్మాణం కోసం ఇస్తున్న నిధులను కూడా దారిమళ్ళించి పేద ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు అని విరుచుకుపడ్డారు. కరవు సాయం కోసం కేంద్రం నుంచి వచ్చిన రూ.900 కోట్ల నిధులను కూడా రైతులకు ఇవ్వని విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. 14, 15 ఆర్థిక సంఘం పంచాయతీల అభివృద్ధికి కేటాయించిన నిధులను సర్పంచ్‍ల డిజిటల్ కీ లను అక్రమంగా వాడి రూ.8.60 కోట్ల నిధులను మాయం చేశారు అని మండిపడ్డారు. పంచాయతీల ఖాతాల్లోని నిధులను దారిమళ్ళించడం రాజ్యాంగ విరుద్ధమన్న విషయం వైసీపీ పెద్దలకు తెలియదా? అని యనమల ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ చర్యతో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు వంటి పథకాలకు కూడా బిల్లులు చెల్లించలేని దుస్థితికి ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని ధ్వజమెత్తారు.గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తులు నిర్మిస్తూ ప్రజలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న నిధులను కూడా దారిమళ్లించి గ్రామీణ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారు అని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో రూ.7,879 కోట్ల నిధులను దారిమళ్లించి లక్షలాదిమంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసపోయేలా సీఎం వైఎస్ జగన్ చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.



Next Story

Most Viewed