తిరుపతిలో మళ్లీ బాంబు కలకలం.. ప్రముఖ హోటళ్లకు బెదిరింపులు

by Kema Shiva Kumar |

తిరుపతిలోని ప్రముఖ హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించి తనిఖీలు చేపట్టారు.

తిరుపతిలో మళ్లీ బాంబు కలకలం.. ప్రముఖ హోటళ్లకు బెదిరింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆధ్యాత్మిక నగరం తిరుపతి (Tirupati)లో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) తీవ్ర కలకలం రేపాయి. గత కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు అటు భక్తులను, ఇటు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, నగరంలోని మూడు ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న హోటళ్లను టార్గెట్ చేశారు. కపిలతీర్థం రోడ్డులో ఉన్న ప్రముఖ రాజ్ పార్క్ హోటల్ (Raj Park Hotel), పాయ్ వైస్రాయ్ (Pai Viceroy) హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అదేవిధంగా ఉప్పరపల్లి ప్రాంతంలోని ఎస్ఆర్‌బీ హోటల్‌ను కూడా పేల్చివేస్తామంటూ హెచ్చరికలు అందాయి.

రంగంలోకి దిగిన పోలీసులు..

హోటళ్ల సిబ్బంది సమాచారం మేరకు తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (Bomb Disposal Squad), డాగ్ స్క్వాడ్ (Dog Squad) బృందాలు సంబంధిత హోటళ్లకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. హోటల్ గదులు, పార్కింగ్ ఏరియా, లాబీల్లో తనిఖీలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా హోటళ్లలో ఉన్న పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భక్తుల్లో ఆందోళన..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వేలాది మంది భక్తులు ఈ హోటళ్లలోనే బస చేస్తుంటారు. వరుస బెదిరింపులతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇవి ఉత్తుత్తి బెదిరింపులే కావొచ్చని పోలీసులు భావిస్తున్నప్పటికీ, ఎక్కడా అశ్రద్ధ వహించకుండా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం ఈ-మెయిల్ ఐడీలను ట్రాక్ చేస్తోంది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో నగర ప్రజలు, భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని, భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Next Story