Ap News: బీజేపీకి కొత్త అధ్యక్షుడు..? సోము వీర్రాజుకు షాక్ తప్పదా?

by Disha Web Desk 16 |
Ap News: బీజేపీకి కొత్త అధ్యక్షుడు..? సోము వీర్రాజుకు షాక్ తప్పదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణ భారతదేశంపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాభంతో భంగపడ్డ బీజేపీ రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లు పలుమార్లు భేటీ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీలో సంస్థాగత మార్పులు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులను మార్చే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును మార్చే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. సోము వీర్రాజుపై ఓ వర్గం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ క్యాడర్‌ను సమన్వయపరచడంలో విఫలమయ్యారని విమర్శలు సైతం ఉన్నాయి. మరోవైపు నెలల వ్యవధిలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అధ్యక్షుడిని మార్చాలనే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రూపులుగా విడిపోయిన బీజేపీ

సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే రెండు గ్రూపులుగా బీజేపీ విడిపోయిందనే ప్రచారం ఉంది. వ‌ల‌స నేత‌ల‌కే సోము వీర్రాజు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే పార్టీలోని ఓ వర్గం ఆరోపించింది. ముఖ్యంగా వ‌ల‌స నేత‌లంతా టీడీపీ ప్రయోజ‌నాల కోసం ప‌ని చేస్తున్నార‌నే వాద‌న సైతం లేకపోలేదు. మొత్తానికి ఈ వలస నేతల పుణ్యమా అంటూ బీజేపీలో లొల్లిలు ప్రారంభమయ్యాయి. అయితే వీటిని పరిష్కరించడంలో సోము వీర్రాజు విఫలమయ్యారనే ప్రచారం ఇప్పటికీ ఉంది. మరోవైపు టీడీపీకి బీజేపీ ఎంతదూరమో వైసీపీకి అంతేదూరమన్న అంశాన్ని ప్రజలకు చేరవేయడంలో సోము వీర్రాజు విఫలమయ్యారనే ప్రచారం ఉంది. ఇప్పటికే ఏపీలో వైసీపీ, బీజేపీ ఒక్కటేనన్న అభిప్రాయం ఉంది. అయితే ఇది పార్టీకి భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందికరమని నాయకత్వం పరిగణిస్తుంది. అయినప్పటికీ వైసీపీని టార్గెట్ చేయడంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోము వీర్రాజు అండ్ టీం అంతగా దూకుడు ప్రదర్శించడం లేదనే ప్రచారం ఉంది.

జనసేనతో కొరవడిన సమన్వయం

ఇదిలా ఉంటే మిత్రప‌క్షమైన జ‌న‌సేన‌ను త‌మ‌తో క‌లిసి న‌డిచేలా చేయ‌డంలో సోము వీర్రాజు విఫ‌ల‌మ‌య్యార‌ని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వీర్రాజు వైఖ‌రి వ‌ల్లే బీజేపీకి ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. పవన్ కల్యాణ్‌ను జనసేన పార్టీని వైసీపీ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నా మిత్ర పక్షంగా కనీసం పట్టించుకోవడం లేదని జనసైనికులు సైతం ఆగ్రహంగా ఉన్నారు. అదే తరుణంలో సోము వీర్రాజు ఎంతసేపు టీడీపీని కార్నర్ చేస్తున్నారే తప్ప వైసీపీని పన్నెత్తిమాట కూడా అనడం లేదని జనసైనికులే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా ప్రచారం ఉంది. టీడీపీపైనే విమర్శలు ఎక్కుపెడుతున్న సోము వీర్రాజు వైసీపీపై ఎందుకు విమర్శలు చేయడం లేదని బీజేపీలోని ఓ వర్గం సైతం అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఈ పరిణామాలే జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీలో బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న ప్రచారం ఉందని, దాన్ని తుడిచి పెట్టేందుకు సోము వీర్రాజు ఏమాత్రం ప్రయత్నాలు చేయడం లేదని జనసైనికులు విమర్శిస్తున్నారు. ఒకవైపు జనసేనతో పొత్తు అంటూనే మరోవైపు వైసీపీని చంకన ఎక్కించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంలో లోపమా లేక పార్టీ జాతీయ నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వైసీపీకి దగ్గరవుతున్నారో ఏంటో తెలియడం లేదని అంటున్నారు. వైసీపీతో స్నేహ బంధం తెంచుకుంటేనే బీజేపీ వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్లాలంటూ జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.

జూలై 3న నిర్ణయం

అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మార్పుపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం అనంతరం బీజేపీ అగ్రనాయకత్వం ఓ నిర్ణయానికి రానున్నాయి. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు తీసుకోవాల్సిన చర్యలు పలు అంశాలపై కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇకపోతే ఏపీలో సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే ఎవరికి ఆ స్థానం ఇవ్వాలనే యోచనలో బీజేపీ నాయకత్వం మల్లగుల్లాలుపడుతున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించాలా లేక ఎవరికి అప్పగించాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే అదే స్థాయిలో సమర్థతకలిగిన నాయకుడు ఉండాలనే దానిపై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అధ్యక్షుడి మార్పు వాయిదా పడుతూ వస్తుందనే ప్రచారం కూడా ఉంది.



Next Story

Most Viewed