పోలవరం జిల్లాలో రీ ఎంట్రీ ఇచ్చిన పెద్దపులి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-25 04:08:39  IST  )

పోలవరం జిల్లా వాసుల్ని పెద్దపులి బెడద వెంటాడుతూనే ఉంది. తాజాగా జిల్లాలోకి పెద్దపులి రీ ఎంట్రీ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.

పోలవరం జిల్లాలో రీ ఎంట్రీ ఇచ్చిన పెద్దపులి
X

దిశ, దేవిపట్నం: తూర్పుగోదావరి జిల్లా పరిసరాల్లో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి, మళ్లీ తన దిశను మార్చుకుని పోలవరం అటవీ పరిధిలోకి ప్రవేశించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పులి కోరుకొండ మండలం పాండవుల మెట్ట ప్రాంతం నుంచి దేవీపట్నం వైపునకు మళ్లింది.

కొండల పైనే సంచారం..

దేవీపట్నం మండలం కొత్తవీధి, బూరుగుబంద గ్రామాల మధ్య ఉన్న దట్టమైన కొండ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు శనివారం తెల్లవారుజామున గుర్తించారు. ఈ పులి కదలికలను నిశితంగా గమనిస్తున్న అధికారులు, పాదముద్రలు, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా ఇది పోలవరం అటవీ రేంజ్‌లోకి ప్రవేశించిందని నిర్ధారించారు. దీంతో అటవీ అంచున ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ప్రజలకు అటవీశాఖ హెచ్చరికలు..

పులి సంచారం నేపథ్యంలో ఇందుకూరు రేంజ్ అధికారి కొండలరావు స్థానిక ప్రజలకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా బూరుగుబంద, కొత్తవీధి, పరిసర గ్రామాల ప్రజలు ఎవరూ ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. పశువుల కాపరులు తమ పశువులను అడవి వైపు తీసుకెళ్లవద్దని, రాత్రి సమయాల్లో పొలాల వద్ద ఉండవద్దని కోరారు. ఏదైనా అత్యవసరమైతే తప్ప గ్రామస్తులు బయటకు రావొద్దని సూచించారు.

Next Story