బీసీల ద్రోహి జగన్.. 21బీసీ కులాల భౌగోళిక పరిమితులు రద్దు చేయడం అన్యాయం: అచ్చెన్నాయుడు

by Disha Web Desk 21 |
బీసీల ద్రోహి జగన్.. 21బీసీ కులాల భౌగోళిక పరిమితులు రద్దు చేయడం అన్యాయం: అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జగన్ రెడ్డి బీసీల ద్రోహి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని 21 బీసీ కులాలకు భౌగోళిక పరిమితులు రద్దు చేయడమంటే వారి వెన్నెముక విరిచినట్లేనని అచ్చెన్నాయుడు అన్నారు. జీవనోపాధి కోసం పక్క ప్రాంతాలకు వెళ్లేవారి పరిస్థితి ఏంటి.? జగన్ తీసుకున్న నిర్ణయంతో 21 బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కులాలకు ఉన్న పరిమితులు రద్దు చేయడం వల్ల విద్య, వైద్యం, రాజకీయంతో పాటు అన్ని విధాలా నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్పుకొచ్చారు. విద్యార్థులు రిజర్వేషన్లు కోల్పోతారు... విద్య పరంగా తీవ్రంగా నష్టపోతారు అని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న విధానంతో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి.? ఒక కులాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక సాధికార బస్సు యాత్రలు చేస్తుంది ఇందుకేనా.? ఇప్పటికే స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం వల్ల 16,800 పదవులను బీసీలు కోల్పోయారన్నారు. బీసీలకు పీజీ చదువులకు రియంబర్స్మెంట్ రద్దు చేశారు. విదేశీ విద్య దూరం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్లు నాశనం చేసి బీసీలను రోడ్డున పడేశారు. 74 మంది బీసీలను హత్య చేశారని ఆరోపించారు. ఇప్పుడు భౌగోళిక పరిమితులు రద్దు చేసి మరో అన్యాయానికి ఒడిగట్టారన్నారు. ఇందుకేనా నా బీసీలు అంటూ వేదికలపై ఉపన్యాసాలు.? ఇందుకేనా కుల గణన అంటూ నాటకాలు? బీసీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న జగన్ రెడ్డికి రాజకీయంగా బీసీలే సమాధి కడతారు. బీసీల సత్తా ఎలా ఉంటుందో వైసీపీకి చూపిస్తాం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.



Next Story