రాష్ట్రంలో అరటి రైతులది అరణ్య రోదన : వైయస్ షర్మిలా

by Thanuru Gopichand |   (  Updated:2025-11-21 05:51:00  IST  )

రాష్ట్రంలో అరటి రైతుల జీవితం అరణ్య రోదనగా మారిందని ఏపీ కాంగ్రెస్ (Congress) చీఫ్ వైయస్ షర్మిలా (YS Sharmila) ఆరోపించారు.

రాష్ట్రంలో అరటి రైతులది అరణ్య రోదన : వైయస్ షర్మిలా
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో అరటి రైతుల జీవితం అరణ్య రోదనగా మారిందని ఏపీ కాంగ్రెస్ (Congress) చీఫ్ వైయస్ షర్మిలా (YS Sharmila) ఆరోపించారు. ఎక్స్ వేదికగా షర్మిలా స్పందిస్తూ సిరులు కురిపించే అరటి పంట నేడు రైతుల కంట కన్నీరు తెప్పిస్తోందన్నారు. అన్నదాతను పంట నష్టం ముంచుతుంటే కూటమి ప్రభుత్వం వారి ఆక్రందనను పట్టించుకోవడం లేదని విమర్శించారు. టన్ను ధర రూ.28 వేల నుంచి వెయ్యి రూపాయలకు పడిపోయిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు.

వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలన్నారు. రైతులను ఆదుకోవాల్సిన ఉద్యాన శాఖ అసలు పనిచేస్తుందా అని ప్రశ్నించారు. ఆరుగాలం కష్టించి పండించిన అరటి గెలలను రైతులు పశువులకు మేతగా పడేస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతు సంక్షేమం ఎక్కడుందన్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టిన రైతులకు ఆదాయం లేకపోతే ఎలా సుభిక్షంగా ఉంటారన్నారు. కిలో అరటి ధర రూపాయి అనే ఎవరైనా అది రైతులకు దగా చేసినట్లేనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పక్షాన డిమాండ్

అరటి రైతుల బాధలను విని.. ధర పతనంపై సమీక్ష జరపాలని వైయస్ షర్మిలా సీఎం చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. యూరప్ దేశాలకు ఎగుమతులు తగ్గడంపై పరిశీలన చేసి ఎగుమతులు మళ్లీ ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. రైతులకు టన్నుకు కనీసం 25వేలు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు చేపట్టాలన్నారు.

Next Story