రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. జీతాలు ఆలస్యం

by Disha Web Desk 4 |
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్..  జీతాలు ఆలస్యం
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి జీతాలు లేటయ్యాయి. పెన్షనర్లదీ అదే కథ. ఒకటో తారీఖున అందాల్సిన జీతాలు ఈ సారి 5వ తేదీ తర్వాతే అందవొచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. దీనికి సాంకేతిక కారణాలను సమస్యగా చూపుతున్నాయి. అయితే ఉద్యోగ సంఘ వర్గాలు మాత్రం సర్కారు ఖజానాలో డబ్బు లేకపోవడం వల్లే అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

చేతిలో డబ్బులు లేకుండానే వెళ్లిపోయిన ఉగాది

సాధారణంగా ఏ నెల అయినా ఒకటి లేదా రెండో తారీఖుల్లో సెలవు లేదా పండుగ లాంటిది వస్తే అంతకు ఒకరోజు ముందే జీతాలు జమ చేస్తూ ఉంటుంది. అయితే ఏపీలో మాత్రం ఈ పద్ధతి వేరేగా ఉంటూ వస్తోంది. మితిమీరిన సంక్షేమ పథకాల అమలుకు తోడు అప్పులకుప్పగా మారిన ఏపీలో వస్తున్న రాబడికి.. పెడుతున్న ఖర్చుకు మధ్య పొంతన కుదరడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతూ వస్తున్నారు. గతంలో వరుసగా ప్రతి నెలా జీతాలు లేటవ్వడంతో ఉద్యోగులు గగ్గోలుపెట్టారు. అయితే కొన్నినెలలుగా జీతాలు టైముకే ఇస్తూ వచ్చిన ప్రభుత్వం ఈ నెల మాత్రం మళ్లీ పాత పంథాకే వచ్చింది. ఈ నెల 5వ తారీఖు తర్వాతనే జీతాలు,పెన్షన్లు పడే అవకాశం ఉందంటున్నాయి ట్రెజరీ వర్గాలు. దాంతో ఈ ఏడాది కొత్త తెలుగు సంవత్సరాది చేతిలో డబ్బు లేకుండానే వెళ్లిపోయింది అంటున్నాయి ఉద్యోగ వర్గాలు.

సాంకేతికే సమస్యలే కారణం

అయితే జీతాల ఆలస్యానికి సాంకేతికంగా ఏర్పడ్డ సమస్యలే కారణమని అధికార వర్గాలు అంటున్నాయి. ఎప్పుడూ జీతాలు ప్రాసెస్ చేసే ఎస్ఏపీ ప్లాట్‌ఫామ్‌ను మార్చి వేరే ప్రోగ్రామింగ్ ద్వారా బిల్లులు అప్‌లోడ్ చేయడంతో అవి రిటర్న్ అయ్యాయని వారు చెప్పుకొస్తున్నారు. కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఆర్బీఐకు అనుసంధానం కాకపోవడంతోనే జీతాలు,పెన్షన్లకు చెందిన బిల్లులు వెనక్కు వచ్చేశాయని ఆర్థిక శాఖ వర్గాల కథనం. అందుకే మరోసారి ఆ బిల్లులన్నింటినీ సబ్మిట్ చేయాలని ట్రెజరీని కోరడంతో ఆలస్యం అయిందనీ మరో ఒకటి రెండు రోజుల్లో జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ కావొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. దానికి తోడు ఉగాది, ఆదివారం అంటూ సెలవులు రావడాన్ని కూడా ఒక కారణంగా ప్రభుత్వం చూపుతోంది.

ఆర్థిక సంవత్సర ముగింపూ కారణమే

మార్చి నెల ముగింపు సందర్భంగా ప్రభుత్వంపై బిల్లుల చెల్లింపు కోసం ఒత్తిడి ఉంటుంది. ఖజానాలో ఉన్న కొన్ని నిధులనూ వాటికోసం చెల్లించారని తెలుస్తోంది. సర్పంచుల ఖాతాల్లోని పంచాయతీల నిధులూ వాడేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఆర్బీఐ ఇచ్చే వేస్ అండ్ మీన్స్ వెసులుబాటు నిధులు రెండువేల కోట్లనూ ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది అంటున్నారు. ఈనేపథ్యంలో ప్రస్తుతం జీతాలు ఇవ్వాలంటే అప్పు కోసం వెళ్లాల్సిందేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. నూతన ఆర్థిక సంవత్సరం మొదలైంది కాబట్టి కేంద్ర ఆర్థిక శాఖ కొత్త అప్పులకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తుంది. దానిని ఉపయోగించుకొని కొత్త అప్పుల కోసం ఏపీ రెడీ అవుతుందని, అవి వస్తే జీతాలు చెల్లించాలని చూస్తుందనే కథనాలు వెలువడుతున్నాయి. లేదా బాండ్లను తాకట్టు పెట్టాలంటే మాత్రం మంగళవారం వరకూ ఆగాల్సి ఉంటుంది. అదే గనుక జరిగితే జీతాలు అందాలంటే 5వ తేదీ దాటిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు జీతాలు ఎప్పుడు పడతాయో అన్న సందేహం ఉద్యోగులను వేధిస్తోంది.

Next Story

Most Viewed