రాష్ట్రంలోని ఐదు మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ల‌కు అవార్డులు

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-18 07:20:42  IST  )

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఏపీ మంత్రి నారాయణ స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డులు అందుకున్నారు

రాష్ట్రంలోని ఐదు మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ల‌కు అవార్డులు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతుల మీదుగా ఏపీ మంత్రి నారాయణ స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డులు అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఐదు అవార్డులకు ఏపీలోని 5 నగరాలు ఎంపికయ్యాయి. విజయవాడ, గుంటూరు, జీవీఎంసీ, రాజమహేంద్రవరం, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. ఈ రోజు(శుక్రవారం) న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌, ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభితోపాటు ఆయా కార్పొరేషన్ల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో ఏపీ మంత్రి నారాయణ ఢిల్లీ పర్యటనలో భాగంగా యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌ను సందర్శించారు. ద్వారకా సెక్టార్ 25లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద కన్వెన్షన్‌ను మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్‌తో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. భారీ సమావేశ హాల్స్‌తో కూడిన కన్వెన్సన్ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. అత్యాధునిక టెక్నాలజీ, సీటింగ్, అబ్బుర పరిచే డిజైన్‌ల గురించి మంత్రి నారాయణకు కన్వెన్షన్ సెంటర్ ప్రతినిధులు చెప్పారు. ఈ తరుణంలో యశోభూమి కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని అమరావతిలో నిర్మించే కన్వెన్షన్ సెంటర్లలో ఉపయోగించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. అమరావతిలో నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Next Story