7 కి.మీ. సైకిల్‌పై వెళ్లి.. వ్యవసాయ పనుల్లో మంత్రి నిమ్మల

by Vemula.Srinu Prasad |

ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తన బిజీ షెడ్యూల్ నుంచి చిన్న విరామం తీసుకున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆయన రైతుగా మారిపోయారు. ..

7 కి.మీ. సైకిల్‌పై వెళ్లి.. వ్యవసాయ పనుల్లో మంత్రి నిమ్మల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు(Ap Minsiter Nimmala Ramanaidu) తన బిజీ షెడ్యూల్ నుంచి చిన్న విరామం తీసుకున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆయన రైతుగా మారిపోయారు. పాలకొల్లు(Palakollu)లోని తన నివాసం నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామం అగర్తిపాలేనికి ఆయన సాధారణ వ్యక్తిలా సైకిల్‌పై వెళ్లారు. ఈ ప్రయాణంలో దారిపొడవునా స్థానిక ప్రజలను పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

స్వగ్రామం చేరుకున్న అనంతరం మంత్రి రామానాయుడు(Minsiter Ramanaidu) నేరుగా తన సొంత రొయ్యల చెరువుల వద్దకు వెళ్లారు. అక్కడ స్వయంగా రొయ్యలకు మేత వేసి, వాటి ఎదుగుదలను నిశితంగా పరిశీలించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దిగి, అక్కడ పనులు చేస్తున్న కూలీలతో ముచ్చటించారు. వారితో కలిసి ఉత్సాహంగా ట్రాక్టర్‌పై కూర్చుని దుక్కిదున్నారు. మంత్రి పదవిలో ఉన్నప్పటికీ, మట్టి వాసనను మరువకుండా సాధారణ రైతులా ఆయన శ్రమించిన తీరు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.

గోదావరి డెల్టాలకు సాగునీరు విడుదలయిన నేపథ్యంలో సాగునీటి శాఖ మంత్రి స్వయంగా ఇలా పొలం పనుల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయ పనుల్లో గడపడం ద్వారా రైతు కష్టాన్ని, వారి అవసరాలను మరోసారి క్షేత్రస్థాయిలో అర్థం చేసుకునేందుకే ఈ రోజంతా కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story