వరుస మరణాలతో వణుకుతోన్న తురకపాలెం.. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ పర్యటన

by Naga Rani Yarlagadda |

వరుస మరణాలతో గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

వరుస మరణాలతో వణుకుతోన్న తురకపాలెం.. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస మరణాలతో గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఆ గ్రామంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పర్యటించారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ శ్రీహరి మాట్లాడుతూ.. ఈనెల 2వ తేదీ నుంచి గ్రామంలో వైద్య శిబిరం ప్రారంభమవ్వగా.. చికిత్స కోసం వచ్చేవారి సంఖ్య తగ్గిందని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీ వరకూ వైద్య శిబిరం కొనసాగుతుందని వెల్లడించారు. కాగా.. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో అస్వస్థతకు గురైన గ్రామస్తులకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

అనారోగ్యానికి గురైన వారికి స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ ఎక్కువ మోతాదులో యాంటీబయోటిక్స్ ఇచ్చాడని, వాళ్లు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని నిబంధనలను గుర్తుచేశారు. అందుకు విరుద్ధంగా వైద్యం చేసినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు తురకపాలెం గ్రామస్తులు గ్రామంలో ఉన్న బొడ్రాయికి రెండ్రోజులుగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

Next Story