అమరావతికి ఏపీ మారిటైమ్ బోర్డు.. ఉత్తర్వులు జారీ

by Naga Rani Yarlagadda |

రాష్ట్రప్రభుత్వం మరో కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఉన్న మారిటైమ్ బోర్డును అమరావతికి మారుస్తూ జీఓ జారీ చేసింది.

అమరావతికి ఏపీ మారిటైమ్ బోర్డు.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రప్రభుత్వం మరో కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పోర్టులు, తీరప్రాంత అభివృద్ధి, సముద్ర సంబంధిత కార్యకలాపాల పర్యవేక్షణకు బాధ్యత వహించే ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు (APMB) ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నం నుంచి అమరావతికి తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ 17ను విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం విశాఖలో కొనసాగుతున్న APMB ప్రధాన కార్యాలయం ఇకపై అమరావతిలో పనిచేయనుంది. పరిపాలనా వికేంద్రీకరణ, ప్రభుత్వశాఖల సమన్వయం, నిర్ణయాల అమలులో వేగం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

2019లో వైసీపీ సర్కారు.. కాకినాడలో ఉన్న ఈ బోర్డు ఆఫీసును విశాఖకు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ నుంచి పోర్టు ఆధారిత కార్యకలాపాలు అనుకూలంగా ఉంటాయని నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో తెలిపింది. అయితే ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో వివిధ ప్రభుత్వ సంస్థలు, విభాగాల ప్రధాన కార్యాలయాలను అమరావతికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఏపీ మారిటైమ్ బోర్డు కార్యాలయాన్ని కూడా అమరావతికి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో విశాఖలో ఉన్న కార్యాలయ సిబ్బంది, పరిపాలనా విభాగాల తరలింపు ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Next Story