AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు

by Kema Shiva Kumar |

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు దాడులను మరింత ముమ్మరం చేశారు.

AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ (Money Laundering) కోణంలో దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఇవాళ ఉదయం నుంచే దూకుడు పెంచారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తూ సంచలనం సృష్టించారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో కీలక నిందితులైన వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాలే లక్ష్యంగా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు నడుమ అధికారులు నిందితుల ఇళ్లలోకి ఎంటర్ అయ్యారు.

మనీ లాండరింగ్‌పైనే ఫోకస్..

లిక్కర్ పాలసీ మార్పులు, మద్యం వ్యాపారంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందని, ఆ సొమ్ము మనీ లాండరింగ్ ద్వారా చేతులు మారిందని ఈడీ (ED) అనుమానిస్తోంది. ఈ క్రమంలో నిందితుల నివాసాల్లో కీలక పత్రాలు, బ్యాంక్ లావాదేవీల రికార్డులు, హార్డ్ డిస్క్‌లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ, ఈ దాడుల ద్వారా మరిన్ని పక్కా ఆధారాలను సేకరించి నిందితులను చుట్టుముట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీల్లో లభించే ఎవిడెన్స్‌లపై సాయంత్రం ఈడీ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడే చాన్స్ ఉంది.

Next Story