AP: రాష్ట్రంలో మళ్లీ కొలువుల జాతర.. ఉగాదికి DSC నోటిఫికేషన్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-19 02:48:40  IST  )

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది కానుకగా 3,600 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమతున్నట్లుగా తెలుస్తోంది.

AP: రాష్ట్రంలో మళ్లీ కొలువుల జాతర.. ఉగాదికి DSC నోటిఫికేషన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుంది. రాష్ట్రంలో మరో డీఎస్సీ (DSC) నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఉగాది పండుగ కానుకగా ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో మొత్తం 3,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా లెక్క తేలింది. ఆదర్శ పాఠశాలల్లో పీజీటీ (PGT), టీజీటీ (TGT) పోస్టులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ ఖాళీలు, సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో బోధనా సిబ్బంది కొరత ఉండటంతో ప్రభుత్వం మరో డీఎస్సీ వేసేందు సన్నద్ధమవుతోంది.

సిలబస్‌లో మార్పుల్లేవు..!

ఈసారి డీఎస్సీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలుస్తోంది. గతేడాది ప్రకటించిన సిలబస్‌నే ఈ నోటిఫికేషన్‌కు కూడా కొనసాగించే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులు పాత మెటీరియల్‌తోనే తమ ప్రిపరేషన్‌ను కొనసాగించవచ్చు. గత డీఎస్సీ తరహాలోనే గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇచ్చే చాన్స్ ఉంది. జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, రిజర్వేషన్ అభ్యర్థులకు (SC/ST/BC/EWS) 49 ఏళ్ల వరకు అవకాశం ఉండవచ్చు. ఈ నియామకాల్లో కూడా ‘టెట్’ (TET) మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. మిగిలిన 80 శాతం మార్కులు డీఎస్సీ పరీక్ష ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలోనే నిర్వహించనున్నారు.

ఆర్థిక శాఖ అనుమతికి..

ప్రస్తుతం జిల్లాల వారీగా రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్లను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే ఆర్థిక శాఖ అనుమతికి పంపిస్తారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పరీక్షకు కేవలం 45 నుండి 60 రోజుల సమయం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ కోసం వేచి చూడకుండా ఇప్పటి నుండే తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story