కాకిలెక్కలొద్దు.. మా డబ్బు మాకివ్వండి: ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

by Javid Pasha |
కాకిలెక్కలొద్దు.. మా డబ్బు మాకివ్వండి: ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘మేం దాచుకున్న డబ్బులు మాకివ్వండి. అంతేకాదు చట్టపరంగా మాకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వాలి. అలాగే మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలి అని అడుగుతున్నాం. వాటికి సమాధానం చెప్పకుండా కాకిలెక్కలు ఎందుకు చెప్తారు’ అని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. రావాల్సిన డబ్బులే అడుగుతుంటే ఇష్టం వచ్చిన లెక్కలు చెప్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు పోరాటం చేసి తీరుతామని అందులో ఎలాంటి సందేహం లేదని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించే వరకు పోరాడుతూనే ఉంటామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశర్లు ప్రకటించారు.

లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వండి

ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన డబ్బులు చెల్లించడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రిటైర్ అయిన వాళ్లకు గానీ మరణించిన వారికి గానీ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే రూ.3వేల కోట్లకు పైగా చెల్లింపులు ఉద్యోగులకు చేశామని ప్రభుత్వం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.3వేల కోట్లు ఎలా చెల్లింపులు చేశారో మాటల్లో కాదని లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగుల బకాయిలకు ఎంత నిధులు విడుదల చేశారు? ఇంకా ఎంత పెండింగ్‌లో ఉంది? ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది అనే అంశాలపై లిఖిత పూర్వకంగా వివరాలు ఇవ్వాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని కానీ ప్రభుత్వం స్పందించడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పుకొచ్చారు.

ఏప్రిల్ 5న అన్ని యూనియన్లతో సమావేశం

ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అంతేకాదు పీఆర్‌సీ ఎరియర్స్‌ను రిటైర్మెంట్‌ తర్వాత ఇస్తామంటూ ప్రభుత్వం విడుదల చేసిన మెమోపై బొప్పరాజు వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మెమోను ఏపీ జేఏసీ అమరావతి పక్షాన పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించారు. 11వ పీఆర్సీలో పే స్కేల్‌ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఉద్యమం కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 5న విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నాయకత్వంతో, పలు శాఖలకు సంబంధించిన సంఘాల నేతలతో సమావేశం నిర్వహించబోతున్నట్లు బొప్పరాజు వెల్లడించారు. ఆ సమావేశం అనంతరం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాం అని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.

Next Story

Most Viewed