నంబాల కేశవరావుతో సహా మావోయిస్టుల మృత దేహాల్ని అప్పగించండి: ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

by Ramesh Naini |   (  Updated:2025-05-24 07:39:33  IST  )

ఇటీవల ఛత్తీ‌సగఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల అప్పగింతపై సందిగ్ధత వీడింది.

నంబాల కేశవరావుతో సహా మావోయిస్టుల మృత దేహాల్ని అప్పగించండి: ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
X

దిశ ప్రతినిధి, బాపట్ల/ దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల (chhattisgarh encounter) ఛత్తీ‌స్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల అప్పగింతపై సందిగ్ధత వీడింది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల బంధువులకు తాజాగా కాస్త ఊరట కలిగింది. మావోయిస్టు పార్టీ కేంద్రం కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా మావోయిస్టుల మృత దేహాల్ని వారి బంధువులకు అప్పగించాలని శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఛత్తీ‌స్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు, అగ్రనేత సజ్జా వెంకట నాగేశ్వరరావు అలియాస్‌ నవీన్‌ మృతదేహాలను తమకు అప్పగించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు శుక్రవారం హైకోర్టులో హౌజ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

కేశవరావు తల్లి భారతమ్మ, సోదరుడు ఢిల్లీశ్వరరావు, అలాగే సజ్జా నాగేశ్వరరావు సోదరుడు శ్రీనివాసరావు, మరికొందరు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌, జస్టిస్‌ వై.లక్ష్మణరావుతో కూడిన ధర్మాసనం శనివారం వర్చువల్‌గా విచారణ జరిపింది. ఈ క్రమంలోనే మావోయిస్టుల మృత దేహాల్ని అప్పగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారమును బట్టి తెలుస్తోంది.

సానుకూలంగా వ్యవహరించి మానవతా దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల ఎన్ కౌంటర్ మృతుల కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా మృతుల భౌతికకాయాల్ని తమకు అప్పగించాలని ఛత్తీస్‌గఢ్ వెళ్లిన బంధువులు అక్కడే వేచి ఉన్నారు. కేశవరావు స్వగ్రామమైన జియన్న పేట (శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం)కి మృతదేహం వస్తే అంత్యక్రియలను జరపడానికి గ్రామస్తులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అంత్యక్రియలకు సహకరించాలని మృతుల బంధువులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

Next Story