కుంకీ ఏనుగులకు "ఆధార్" తరహా కార్డులు.. ఏపీ అటవీశాఖ కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-06 08:03:40  IST  )

ఏనుగుల సంరక్షణలో ఏపీ అటవీశాఖ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఏనుగుల అభయారణ్యంలో ఉన్న ఆరు కుంకీ ఏనుగులకు ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని అధికారులు నిర్ణయించారు. ..

కుంకీ ఏనుగులకు ఆధార్ తరహా కార్డులు.. ఏపీ అటవీశాఖ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏనుగుల(Elephant) సంరక్షణలో ఏపీ అటవీశాఖ(Ap Forest Department) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. చిత్తూరు జిల్లా(Chittoor) పలమనేరు(Palamaneru) పరిధిలోని కౌండిన్య ఏనుగుల అభయారణ్యం(Kaundinya Elephant Sanctuary)లో ఉన్న ఆరు కుంకీ ఏనుగులకు ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఆ ఏనుగుల నుంచి సేకరించిన డీఎన్‌ఏ నమూనాలను ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌(Dehradun Wildlife Institute)కు పంపారు. అక్కడ జరిగే విశ్లేషణల ఆధారంగా ప్రతి ఏనుగుకు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు.

అడవి ఏనుగుల అదుపు కోసం..

సాధారణంగా అటవీ ప్రాంతాల్లో పంటలను నాశనం చేసే లేదా జనావాసాల్లోకి వచ్చే అడవి ఏనుగులను అదుపు చేయడానికి ఈ కుంకీ ఏనుగులను ఉపయోగిస్తారు. వీటికి డీఎన్‌ఏ ఆధారిత గుర్తింపు కార్డులు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వాటికి ఏదైనా వైద్య చికిత్స అందించాలన్నా లేదా వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన సమస్యలను గుర్తించాలన్నా ఈ డేటా ఎంతో కీలకం కానుంది. ఏనుగుల ఆరోగ్యం, సంతతిపై పూర్తి అవగాహన పెంచుకోవడానికి ఈ డిజిటల్ డేటాబేస్ దోహదపడుతుంది.

సాంకేతికతను జోడించి చర్యలు

డెహ్రాడూన్ నుంచి పరీక్షల ఫలితాలు వచ్చిన వెంటనే ఆ వివరాలతో కూడిన గుర్తింపు కార్డులను ఏనుగుల మెడలో లేదా తగిన విధంగా అమర్చనున్నారు. దేశంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం సాంకేతికతను జోడించి చేపడుతున్న ఇటువంటి చర్యలు భవిష్యత్తులో గజరాజుల మనుగడకు, వాటి మెరుగైన సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు.

Next Story