AP | డ్రగ్స్ విక్రేతలుగా విదేశీ మహిళలు!

by Thanuru Gopichand |

మాదక ద్రవ్యాల ముఠాలు విదేశీ మహిళలకు (Foreign Women) డ్రగ్ పెడలర్లుగా (Drug Pedlers) వినియోగించుకుంటున్న ఘటనలు ఇటీవల బయటపడుతున్నాయి.

AP | డ్రగ్స్ విక్రేతలుగా విదేశీ మహిళలు!
X

దిశ, వెబ్ డెస్క్ : మాదక ద్రవ్యాల ముఠాలు విదేశీ మహిళలకు (Foreign Women) డ్రగ్ పెడలర్లుగా (Drug Pedlers) వినియోగించుకుంటున్న ఘటనలు ఇటీవల బయటపడుతున్నాయి. దిల్లీ నుంచి గల్లీ దాకా సాగే దందాలో వారి భాగస్వామ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యా, ఉపాధి, వైద్యం పేరిట దేశానికి వస్తున్న విదేశీయులు డ్రగ్స్ ముఠాల చేతిలో పావులుగా మారుతున్నారు. అందులో విదేశీ మహిళలు కూడా ఉండడం మరింత ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఏపీలో సైతం డ్రగ్స్ విక్రయిస్తూ విదేశీ మహిళలు పట్టుబడిన ఘటన వెలుగు చూసింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో (Andhra University) ఇద్దరికి డ్రగ్స్ విక్రయించిన విషయాన్ని తెలంగాణ ఈగల్ టీం పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి పరారవ్వడానికి ప్రయత్నించిన వారిని రాష్ట్ర సరిహద్దుల్లో పట్టుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో విదేశీ మహిళలు ఇద్దరికి డ్రగ్స్ విక్రయించిన విషయాన్ని ఈగల్ టీం పోలీసులు గుర్తించారు. వారిపై అంతకు ముందు నుంచే నిఘా ఉంచిన పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తుండగా అరెస్టు చేసేందుకు వ్యూహాన్ని రచించారు. ఈ క్రమంలోనే మన్యం జిల్లా పార్వతీపురంకు చెందిన సందీప్ అనే వ్యక్తితో ముగ్గురు విదేశీ యువతులు ఉన్న విషయాన్ని పసిగట్టారు. విశాఖ నుంచి పారిపోయే యత్నం చేస్తుండగా ఈగల్ టీం పోలీసులు విదేశీ యువతులను వెంబడించారు. పోలీసులు వెంటాడుతున్న విషయాన్ని గ్రహించిన యువతులు మార్గం మధ్యలోనే డ్రగ్స్ పడేసి పరారయ్యే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు వారిని వెంబడించి ఏపీ సరిహద్దులో ఈగల్ టీం పోలీసులు అరెస్టు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుల వద్ద నకిలీ పాస్ పోర్టులు, వీసాలను పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో విదేశీ మహిళలను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. హైదరాబాద్ మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో దిల్లీ వెళ్లి విదేశీయులను అదులపులో తీసుకున్న ఈగల్ టీం పోలీసులు అప్పటి నుంచి విదేశీ యువతుల కదలికలపై నిఘా పెంచారని సమాచారం.

Next Story