AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ అంశాలపై ప్రధాన చర్చ

by Naga Rani Yarlagadda |   (  Updated:2024-10-09 14:41:11  IST  )

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో దేవాలయాల పాలకమండళ్లకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.

AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ అంశాలపై ప్రధాన చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) కానుంది. ఈ భేటీలో వివిధ ప్రతిపాదనలు, కీలక అంశాలపై రాష్ట్రమంత్రివర్గం చర్చించనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఇటీవలే రాష్ట్రంలో చెత్తపన్నును రద్దుచేస్తామని సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై కూడా కేబినెట్ తుదినిర్ణయం తీసుకోనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనుంది.

దేవాలయాల పాలక మండళ్లను 15 నుంచి 17 మందికి పెంచడం, పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులుండేలా సభ్యుల్ని నియమించడం వంటి ప్రతిపాదనలపై రాష్ట్రమంత్రివర్గం చర్చించనుంది. అలాగే దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రూ.5 లక్షల కంటే అధికంగా ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో 17 మంది సభ్యులతో కూడిన పాలకమండలిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తిరుమలలో లడ్డూ కల్తీ (Tirumala Laddu Issue) ఘటన తర్వాత.. పాలకమండలిలో బ్రాహ్మణులుండాలన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలన్న ఆలోచనలో ఉంది. ముఖ్యంగా పాలకమండళ్ల నియామకంలో చట్టసవరణకై వచ్చే ప్రతిపాదన పై కేబినెట్ కీలకంగా చర్చించనుంది.

అసెంబ్లీ నిర్వహణ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగతా ఆరునెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టే అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. అదేవిధంగా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story