ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు : ఏపీ బీజేపీ చీఫ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-10 09:43:30  IST  )

ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ, జనసేన పార్టీలపై చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ప్రకటించారు.

ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు : ఏపీ బీజేపీ చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ, జనసేన పార్టీలపై చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ప్రకటించారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణరెడ్డి ఇటీవల తిరుపతిలో నిర్వహించిన బీజేపీ కమలవికాసం కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందని, మిగతా కులాల వారిని కూడా పట్టించుకోవాలని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. 1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గజ్జల మల్లారెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వం కోసం కష్టపడి పనిచేసేవారికి పదవులు దక్కాలని, అన్ని కులాల వారికీ సమాన న్యాయం చేయాలన్నారు. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు లేవన్నారు. కూటమిలో బీజేపీనే ప్రధానమని, తర్వాతే టీడీపీ, జనసేన వాళ్లు ఉంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ స్పందించారు. ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించబోమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆదినారాయణరెడ్డిని వివరణ కోరుతామన్నారు.

Next Story