Breaking: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బోణీ

by Disha Web Desk 16 |
Breaking: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బోణీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బోణీ కొట్టింది. అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్. మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి గెలుపు ఆమె నుంచి ప్రారంభమైంది. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ స్క్రూటినీలో టీడీపీ నేత వేలూరు రంగయ్య దాఖలు చేసిన నామినేషన్‌లో సరైన వివరాలు, డాక్యూమెంట్లు లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో వైసీపీ అభ్యర్థి ఎస్.మంగమ్మ నామినేషన్ ఒక్కటే ఉండటంతో ఆమె ఏకగ్రీవం లాంఛనం కానుంది. ఎస్ మంగమ్మ గెలుపును అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

మరోవైపు తన నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో టీడీపీ అభ్యర్థి రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తన నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. అధికారులు పక్షపాతవైఖరిని అవలంభించారని... దీంతో ఇక న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని చెప్పారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని టీడీపీ అభ్యర్థి రంగయ్య తెలిపారు.

Next Story

Most Viewed