Ap News: కియాపై కీచులాట...క్రెడిట్‌పై TDP,YCP సిగపట్లు

by Disha Web Desk 16 |
Ap News: కియాపై కీచులాట...క్రెడిట్‌పై TDP,YCP సిగపట్లు
X
  • అవార్డు రావడం ఏపీకే గర్వకారణమన్న చంద్రబాబు
  • ప్రభుత్వానికి ప్రజలకు గర్వకారణమన్న విజయసాయిరెడ్డి
  • విజయసాయిరెడ్డికి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన టీడీపీ

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ కార్ల సంస్థ కియాకు అరుదైన గౌరవం దక్కింది. కియా కారెన్స్ మోడల్ కార్‌కు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు వరించింది. ఈ అవార్డు రావడం పట్ల రాజకీయ నేతలు పోటీపడి మరీ ట్వీట్లు చేస్తున్నారు. ఒకవైపు కియా కార్ల సంస్థను అభినందిస్తూనే ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చంద్రబాబు వల్లే కియా కార్ల సంస్థ రాష్ట్రంలో అడుగుపెట్టిందని అందువల్ల క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ చెబుతోంది. మరోవైపు వైసీపీ వల్లే సాధ్యమైందంటూ ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో కియాపై రాజకీయాల్లో కీచులాట మెుదలైంది.

కియాకు అవార్డు ఏపీకే గర్వకారణం

కియా కార్ల సంస్థ చంద్రబాబు నాయుడు హయాంలోనే రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. వేలల్లో యూనిట్ల ఉత్పత్తి మెుదలు పెట్టిన కియా సంస్థ తాజాగా లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తోంది. అంతేకాదు స్థానికులకు, ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కియా కారెన్స్ మోడల్ కార్‌కు అవార్డు రావడం పట్ల రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కియా కార్ల కంపెనీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం ప్లాంట్‌లో తయారైన కియా కారెన్స్ మోడల్ కార్‌కు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఇది ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

ప్రభుత్వానికి గర్వకారణం: విజయసాయిరెడ్డి

కియా కారెన్స్ మోడల్ కార్‌కు అవార్డు రావడం పట్ల వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావడం ప్రభుత్వానికి, ప్రజలకు గర్వకారణమని చెప్పారు. అనంతపురంలో స్థాపించిన ఈ కియా కార్ల సంస్థ తొలుత 57వేల యూనిట్ల ఉత్పత్తితో ప్రారంభించి నేడు 2.27లక్షల యూనిట్లకు చేరడం అభినందనీయమని కొనియాడారు. అంతేకాదు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఈ కియా కార్లను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేయడం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో గర్వంగా ఉందని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తెలిపారు.

సిగ్గనేది అసలు ఉంటే కదా: వంగలపూడి అనిత

కియాకు అవార్డు రావడం రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు గర్వకారణమంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత స్పందించారు. సిగ్గు అనేది అసలు ఉంటే కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో కియా కార్ల సంస్థను ఉద్దేశిస్తూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌ను గుర్తు చేశారు. 'కార్లు అమ్ముడుపోని కారణంగా కియా మోటార్స్ చైనాలోని అతిపెద్ద ప్లాంటును మూసేసింది. మరి అనంతపూర్‌లో ఏర్పాటవుతున్న ప్లాంట్ సంగతేమిటో..? కమీషన్ల కక్కుర్తితో కియా మోటార్స్‌కు చంద్రబాబు రెండు వేల కోట్ల రాయితీలిచ్చాడు. కంపెనీ ఉద్యోగుల్లో స్థానికులు వందమందికి మించి లేరు' అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌ను తెరపైకి తీసుకువచ్చారు. నాడు నేడు అంటూ రెండు ట్వీట్లను తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై రాజకీయంగా దుమారం చెలరేగుతోంది.

ఇవి కూడా చదవండి : Kia Carens carకు అవార్డు.. గర్వకారణమన్న వైసీపీ ఎంపీ

Next Story

Most Viewed