సిట్టింగులలో గుబులు.. ఎమ్మెల్యే టికెట్ల కోసం పాట్లు

by Dishafeatures2 |
సిట్టింగులలో గుబులు.. ఎమ్మెల్యే టికెట్ల కోసం పాట్లు
X

దిశ ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించి మూడు రోజులయ్యింది. యువ నాయకుడి పాదయాత్రను జయప్రదం చేయడానికి ఆయా నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు తమ వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయా నియోజకవర్గాలలో ఎలాగైనా యువ నాయకుడి పాదయాత్రను విజయవంతం చేసి తన సత్తా చాటుకోవడంతో పాటు రానున్న ఎన్నికల్లో తమ టికెట్ కు ఢోకా లేకుండా చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు వారు తమ శక్తియుక్తులను అన్నింటినీ ఒడ్డి తమ తమ నియోజకవర్గాలలో అసమ్మతి కానరాకుండా కాపాడుకుంటూ నాయకుడి దృష్టిలో పడేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు.

ఇలా వారు ఆయా నియోజకవర్గాలలో తమ సత్తా చాటేందుకు యత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో పాదయాత్ర లోనూ, విరామ సమయంలో ఆయనను వ్యక్తిగతంగా కలిసేందుకు వస్తోన్న కొత్త కొత్త మొహాలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇలా వారు బెంబేలెత్తిపోవడకానికి ప్రధాన కారణం ఏంటంటే తమకూ టికెట్ కావాలని వారు అభ్యర్థించడంతో పాటు సిట్టింగ్ లపై లేనిపోని ఆరోపణలు చేయడం, తమకే టికెట్ ఎందుకు ఇవ్వాలో యువ నాయకుడికి వివరించడం, తమకు టోకెట్ ఇవ్వడం వలన పార్టీకి ఒకగూడే ప్రయోజనాల గురించి నర్మగర్భంగా ఆయనకు వివరించడం చేస్తుంటే సిట్టింగులలో గుబులు మొదలయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలలో ఇప్ప

టికే ఇది మొదలవగా.. రానున్న నియోజకవర్గాలలో సైతం పలువురు ఇదే బాటలోనే పయనించడానికి సిద్దమయినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో స్థిరపడి తమకే టికెట్ అన్న కృత నిశ్చయంతో ఉన్న పలువురికి టికెట్ గుబులు పట్టుకుందని ప్రచారం జరుగుతోంది. ఇలా ఉమ్మడి అనంతపురము జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో ఇప్పటికే పలువురు నాయకులపై అసమ్మతి నెలకొనగా ... ఈ పాదయాత్రలో దానిని పూర్తిగా వినియోగించు కోవడానికి అసమ్మతి నాయకులు, న్యూట్రల్ గా ఉన్న పలువురు వ్యక్తులు సిద్ధమయినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీలోని మాజీ ఎమ్మెల్యే లలో టికెట్ గుబులు పట్టుకోవడం గమనార్హం.

యువగళం పాదయాత్రలో కొత్త మొహాలు

యువగళం పాదయాత్రలో కొత్త కొత్త మొహాలు దర్శనమిస్తున్నట్లు పార్టీ వర్గాలలోనే ప్రచారం జరుగుతోంది. ఇలా కనిపిస్తోన్న వారిలో పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులు బాగా సంపాదించుకుని స్థిరపడ్డ రియల్టర్లు, లిక్కర్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాలలో స్థిరపడి అటు ఆర్థికంగానూ, ఇటు సామాజికపరంగానూ గుర్తింపు కలిగిన నాయకులు, వివిధ కుల సంఘాలకు చెందిన నాయకులు, పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులుగా గుర్తింపు పొంది అసమ్మతి గళం విప్పిన నాయకులు ఉండడం గమనార్హం. ఇలా వీరు పాదయాత్రలో పాల్గొనడంతో పాటు యువ నాయకుడికి దగ్గర అయ్యేందుకు పావులు కదుపుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. యువ నాయకుడికి బాగా దగ్గరగా ఉన్న వారిని గుర్తించి వారి ద్వారా ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.

ఇలా వీరు యాత్ర పొడవునా ఫ్లెక్సీలు వేయించడం, నాయకుడికి కావాల్సినవి క్షణాల్లో చేసి పెట్టడం, ఏదయినా సందర్భం వస్తే వారి పేరు నాయకుడి వద్ద ప్రస్తావించేలా వ్యూహం పన్నడం లాంటివి చేస్తూ ఆయన దృష్టిలో పడేందుకు శతవిధాలా కృషి కృషి చేస్తోన్నట్లు సమాచారం. ఇలా యువగళం యాత్రలో కొత్త కొత్త మొహాలు కనపడడంతో సిట్టింగులలో ఆందోళన మొదలయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో నెలకొని ఉన్న అసమ్మతితో తల బొప్పి ఉండడంతో దానిని సరి చేసుకోవడానికే నానా తంటాలు పడుతూ ఉంటే కొత్తగా ఇదేమి తలనొప్పి అని వారు సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం.

లబోదిబోమంటోన్న స్థానిక నాయకులు

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో ఈ విధంగా పలువురు నాయకులు యాత్రలో పాల్గొంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇలా వస్తోన్న వారందరూ ఆయా నియోజకవర్గాలలో టికెట్ లను ఆశించే వస్తోన్నట్లు తెలుస్తోంది. దీనిపై యువ నాయకుడు నారా లోకేష్ నిర్వహించిన ఆంతరంగిక, ఆత్మీయ, ముఖ్య నాయకుల సమావేశంలో సైతం ప్రస్తావిస్తూ ..“చెరువులో నీళ్లు లేనప్పుడు రాని కప్పలు ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయంటూ” నర్మగర్భంగా వ్యాఖ్యానించడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచిన తరువాతే ఎక్కువ సంఖ్యలో టికెట్ లను ఆశించే వారు వస్తున్నారని చెప్పినట్లని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. ఇలా వస్తోన్న పలువురు తాము యాత్రకు కావాల్సిన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని, తమకు టికెట్ ఇవ్వడం మూలంగా తమకులపు వారందరూ పార్టీ వెన్నంటే ఉంటారని, తమకు టికెట్ ఇస్తే పార్టీకి ఏ రకంగా అయినా సహాయ నహకారాలు అందిస్తామని ఇలా రకరకాలుగా తమ వాణిని వినిపిస్తూ యువ నాయకుడికి దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతోపాటు స్థానికంగా ఉన్న ద్వితీయ శ్రేణికి చెందిన అసమ్మతి నాయకులు కూడా కొంతమంది తమకూ టికెట్ కావాలని సిట్టింగులకు వ్యతిరేకంగా గళం విప్పడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే తమకు టికెట్ ఖాయమని భావిస్తోన్న పలువురు నాయకులు, కార్యకర్తలు లబోదిబోమంటూ ఉండడం గమనార్హం. పార్టీ బలోపేతం కోసం నిర్వహిస్తోన్న పాదయాత్ర తమ పీకల మీదకు వచ్చిందని పలువురు నాయకులు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ యాత్రతో ఆర్థికంగా ఇబ్బందులు పడడంతో పాటు తమకే టికెట్ వస్తుందన్న ఆశ కూడా సన్నగిల్లుతోందని పలువురు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

తమకే ఎసరు పెట్టేలా పాదయాత్ర ..?

తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఐకమత్యంగా ఉంచుతూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి, యువ నాయకుడి నాయకత్వాన్ని అందరూ అంగీకరించేలా, రానున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు నారా లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తోన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే స్థానికంగా ఉన్న నాయకులకు మాత్రం ఈ యాత్ర ఇబ్బందులు సృష్టించేదిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన యాత్ర కోసం పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం, అసమ్మతి గళం విప్పకుండా చూసుకోవడం, నీరు-చెట్టు పనులకు సంబంధించి బిల్లులు రాకుండా ఉన్న పార్టీ నాయకులను, కార్యకర్తలను సముదాయించడం, అధికార పార్టీ చేస్తున్న ఒత్తిడి మూలంగా ఇబ్బందులు పడుతోన్న కార్యకర్తలకు అండగా నిలబడడం, వారికి చేయూతను అందివ్వడం ఇలాంటివి అన్నీ ఆర్థిక పరమైన కోణంలోనే చూస్తూ పార్టీ కార్యకర్తలను బయటకు వెళ్లకుండా చూసుకోవడం కత్తి మీద సాముగానే భావిస్తున్నారు.

ఇలా ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండగా యాత్ర వలన మరింత ఆర్థిక భారం మోయాల్సి రావడం అన్నీ భరించినా తమకే టికెట్ వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో ఈ యాత్ర తమకు ఎసరు పెట్టడానికే వచ్చిందా అన్న అనుమానాలు వస్తున్నాయని పలువురు పేర్కొంటుండడం గమనార్హం. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో టికెట్ లను ఆశించే వారి సంఖ్య పెరగడం, తమకు వారు అడ్డువస్తారేమో అన్న భావన సిట్టింగులలో ఉండడంతో పలువురు భయపడిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక నారా లోకేష్ కూడా తనదైన వర్గాన్ని పెంచి పోషించుకునే పనిలో భాగంగానే పలువురితో భేటీ అవుతోన్నట్లు సమాచారం. దీంతోనే సిట్టింగులులో భయం పుట్టినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed