Hindupuram: బాలయ్య అడ్డాపై వైసీపీ కన్ను.. దీపిక ఎంట్రీతో కంచుకోట బద్దలవుతుందా?

by Disha Web Desk 16 |
Hindupuram: బాలయ్య అడ్డాపై వైసీపీ కన్ను.. దీపిక ఎంట్రీతో కంచుకోట బద్దలవుతుందా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో రికార్డులు సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించింది. ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది దేశదృష్టిని వైసీపీ ఆకర్షించింది. అయితే రాయలసీమను క్లీన్ స్వీప్ చేయాలని నాడు వైఎస్ జగన్ భావించారు. అయితే అది కుదరలేదు. కర్నూలు, కడప జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగలిగినా...చిత్తూరు అనంతపురం జిల్లాలో మాత్రం క్లీన్ స్వీప్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆ రెండు జిల్లాల్లో కూడా క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ అధినేత జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ రెండు జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం, పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ కుప్పం, ఉరవకొండ స్టార్ట్ చేసిన వైసీపీ తాజాగా ఆపరేషన్ హిందూపురం స్టార్ట్ చేశారట.

హిందూపురం టీడీపీకి కంచుకోట. నందమూరి ఫ్యామిలీకి నియోజకవర్గ ప్రజలు జై కొడతారు. అది ఎంతలా అంటే రాష్ట్రం అంతటా వైసీపీ వేవ్ ఉన్నప్పటికీ హిందూపురంలో మాత్రం నందమూరి బాలకృష్ణనే ప్రజలు గెలిపించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బాలయ్య గెలవకూడదని జగన్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ హిందూపురంకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్ వైసీపీకి సోకిన అసమ్మతి క్యాన్సర్‌కు కాయకల్ప చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది.

కంచుకోట బద్దలయ్యేనా?

హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి మెుదటి నుంచి కంచుకోట. 1985 నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి ఈ నియోజకవర్గం సెంటిమెంట్‌గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి నందమూరి తారకరామారావు, నందమూరి హరికృష్ణలు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్థి బి.నవీన్ నిశ్చల్‌పై నందమూరి బాలకృష్ణ ఘన విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ అభ్యర్థిని మార్చేసింది. మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దించింది. మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్‌ను పార్టీలోకి చేర్చుకుని ఎన్నికల బరిలోకి దించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైసీపీ గాలిలోకూడా నందమూరి బాలకృష్ణ గెలుపొందారు. అయితే మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే కసితో నందమూరి బాలకృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ గేటు తాకకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్ హిందూపురంకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

దీపిక దీపం వెలిగించేనా!

హిందూపురం నియోజకవర్గంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అయితే టీడీపీకి హిందూపురం కంచుకోట అనేది ఒకప్పటి మాట అని ఇప్పుడు అంత సీన్‌లేదని తనకు అందిన నివేదిక ద్వారా తెలిసిందట. స్థానిక వైసీపీలో అంతర్గత విభేదాలే టీడీపీ గెలుపునకు కారణంగా మారినట్లు గుర్తించారు. అయితే వాటిని సరిదిద్దుకోవాలని ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు ఆదేశించారు. అయినప్పటికీ అసమ్మతి సెగ తగ్గలేదు. ఈ అసమ్మతి సెగ ఏకంగా సొంత పార్టీ నేతల్ని చంపుకునే వరకు వెళ్లింది. చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యకు ఆధిపత్య పోరే కారణమని తెలియడంతో వైసీపీ ప్లాన్ మార్చేసింది. ఇన్‌చార్జిగా ఇక్బాల్‌ను తప్పించింది.

హిందూపురం ఇన్‌చార్జిగా దీపికను నియమించింది. ఇటీవలే ఆమెను ఇన్‌చార్జిగా నియమిస్తూ ఆదేశాలు సైతం ఇవ్వడం జరిగింది. బాలకృష్ణపై మహిళా అభ్యర్థిని బరిలోకి దించితే కాస్త ఫలితాలు ఉంటాయనే భావనలో వైసీపీ ఉంది. అంతేకాకుండా మహిళలపై బాలయ్య అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతుంటారు. వాటినే ఆయుధంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలోకి వెళ్తే ఫలితాలు ఉంటాయని ఓ నివేదిక చెప్పడంతో దీపిక ఎంపికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

మరోవైపు దీపిక ఎంపికతో హిందూపురం వైసీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని పార్టీ యోచిస్తుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం నవీన్ నిశ్చల్, ఎమ్మెల్సీ ఇక్బాల్‌తో పాటుగా దివంగత నేత చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే తరుణంలో ముగ్గురు వేర్వేరుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది పార్టీకి మింగుడుపడటం లేదు. దీంతో వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డి సతీమణి దీపికను సీఎం వైఎస్ జగన్ తెరపైకి తీసుకువచ్చారు. కురుబ సామాజికవర్గానికి చెందిన దీపిక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేణుగోపాల్ రెడ్డిని వివాహం చేసుకుంది. అయితే బీసీ కార్డు కూడా వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుందని వైసీపీ భావిస్తుంది.

సహకరిస్తారా?

హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీ గ్రూపు రాజకీయాలపై ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగంలోకి దిగినప్పటికీ ఎలాంటి ఫలితాలు లేవు. అటు నవీన్ నిశ్చల్, మహమ్మద్ ఇక్బాల్‌తో చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చౌళూరు రామకృష్ణారెడ్డి సైతం ఆయనకు తగిన విధంగా ఆయన రాజకీయం చేశారు. ఇలా మూడుముక్కలాటగా మారిపోయింది. ఈ ముగ్గురు ఒకరికి ఒకరు సహకరించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో దీపికను ఇన్‌చార్జిగా నియమించడం చర్చనీయాంశంగా మారింది. దీపికకు ఈ నేతలు సహకరిస్తారా లేక సహాయనిరాకరణ చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బాలయ్య లాంటి బలమైన ప్రత్యర్థిపై విజయం సాధించాలంటే ఆసామాషీ విషయం కాదు. మరి ఈ సవాళ్లను ఎదుర్కొని దీపిక విజయకేతనం ఎగురవేస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని నెలలు వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed