భావోద్వేగానికి గురైన మంత్రి సంధ్యారాణి

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhya Rani) ప్రెస్ మీట్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

భావోద్వేగానికి గురైన మంత్రి సంధ్యారాణి
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhya Rani) ప్రెస్ మీట్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సహాయకుడిపై (PA) గత కొంతకాలంగా జరుగుతున్న అసత్య ప్రచారాలను గుర్తు చేసుకుంటూ ఆమె కంటతడి పెట్టారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ప్రత్యర్థులు ఇలాంటి నీచమైన ఆరోపణలకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు. ఒక మహిళా మంత్రిగా ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న తన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు కుట్రలు పన్నారని వాపోయారు. వాస్తవాలను తెలుసుకోకుండానే నిరాధారమైన ఆరోపణలు చేయడం తనను ఎంతో కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నెల రోజులుగా క్షోభ

గత నెల రోజులుగా తన కుటుంబం తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తోందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. తన కుమారుడు, పీఏ సతీష్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అవన్నీ సృష్టించినవేనని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక తల్లిగా తనను, ఒక యువకుడిగా తన కుమారుడి భవిష్యత్తును అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించడం అత్యంత దారుణమని ఆమె విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా కావాలని తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు తమ కుటుంబాన్ని మానసికంగా కుంగదీశాయని మంత్రి వివరించారు.

చట్టపరమైన చర్యలు ఉంటాయి

అయితే ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. కుట్రపూరితంగా ఫేక్ స్క్రీన్ షాట్లు సృష్టించి తప్పుడు ఆరోపణలు చేసిన వారిని ఇప్పటికే గుర్తించారని సంధ్యారాణి తెలిపారు. వాస్తవాలు నిరూపణ కావడంతో తనపై బురదజల్లిన వారందరిపై త్వరలోనే కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. తప్పుడు ఫిర్యాదులు చేసిన మహిళతో పాటు, దాని వెనుక ఉన్న సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమని, కానీ వ్యక్తిగత జీవితాలను రోడ్డున పడేసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.

Next Story