అవును.. చేతులు కలిపిన దేవినేని, వసంత కృష్ణ ప్రసాద్

by Disha Web Desk 16 |
అవును.. చేతులు కలిపిన దేవినేని,  వసంత కృష్ణ ప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్: అవును దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్ చేతులు కలిపారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా రాజకీయాలు నడిపిన వీళ్లిద్దరూ ఇప్పుడు ఒక్కటయ్యారు. గత ఎన్నికల్లో మైలవరం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్, టీడీపీ తరపున దేవినేని ఉమ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో దేవినేని ఉమ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఇద్దరు నియోజకవర్గంలో కత్తులు దూసుకున్నారు. పరస్పరం విమర్శలు చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరి మైలవరం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఐదేళ్లు మైలవరం టీడీపీ ఇంచార్జిగా ఉన్న దేవినేని ఉమకు టికెట్ దక్కలేదు. దీంతో దేవినేని ఉమ అసంతృప్తి చెందలేదు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. పార్టీ కోసం వసంతకృష్ణ ప్రసాద్‌తో ఉన్న విబేధాలను పక్కన పెట్టేశారు. అటు వసంత కృష్ణ ప్రసాద్ సైతం గతంలో జరిగిన ఘటనలను మర్చిపోయారు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను కలుపుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

తాజాగా దేవినేని ఉమను గొల్లుపూడిలో కలిశారు. తనకు మద్దతుగా ప్రచారం చేయాలని కోరారు. దీంతో దేవినేని ఉమ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఇద్దరు నేతలు కలిపారు. తాను, వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ పోరాటాలు చేశామని చెప్పారు. తాను, వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజవర్గంలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. అందరం కలిస్తే దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడొచ్చని చెప్పారు. కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మైలవరంలో తెలుగుదేశం జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed