అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ కు అరుదైన గౌరవం

by Thanuru Gopichand |

అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ కు అరుదైన గౌరవం
X

దిశ, వెబ్ డెస్క్ : రిపబ్లిక్ డే వేడుకల వేళ భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు (Women Blind Cricketer Deepika) అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో (Republic Day) ప్రత్యేక అతిథిగా పాల్గొనాల్సిందిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Of India) నుంచి ఆమెకు అధికారికంగా ఆహ్వాన లేఖ అందింది. శ్రీసత్యసాయి జిల్లాలోని అమరాపురం పరిధిలోని తంబాలహట్టి (Tambalahatti) గ్రామంలో ఉన్న ఆమె నివాసానికి అధికారులు విచ్చేశారు. రాష్ట్రపతి తరపున ఆహ్వానాన్ని దీపికకు స్వయంగా అందజేశారు.

ఇటీవల జరిగిన తొలి అంధుల మహిళా టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును అద్భుతంగా నడిపించి, టైటిల్ విజేతగా నిలిపిన దీపిక ప్రతిభను గుర్తించిన రాష్ట్రపతి ఈ ఆహ్వానం పంపారు. దేశ రాజధానిలో అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలను స్వయంగా వీక్షించే అవకాశం లభించడం తన అదృష్టమని, ఇది తన జీవితంలో మర్చిపోలేని గౌరవమని దీపిక ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. క్రీడల్లో అంధుల ప్రతిభను గుర్తించి ఇలాంటి పెద్ద వేదికపై గౌరవించడం తమకెంతో స్ఫూర్తినిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ అపురూప గౌరవానికి గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు దీపిక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక సామాన్య నేపథ్యం నుంచి వచ్చి దేశం గర్వించేలా జట్టును నడిపించిన దీపికకు లభించిన ఈ ఆహ్వానం క్రీడా లోకంలో చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో హర్షాతిరేకాలు కలిగిస్తోంది.

Next Story