ఎయిర్ పోర్టును దూరం చేయొద్దు: సీపీఎం నేతల ధర్నా

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-07 10:59:29  IST  )

విశాఖపట్నం విమానాశ్రయం పరిరక్షణ కోసం సీపీఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ప్రజల అవసరాలు, ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత విశాఖ ఎయిర్‌పోర్టును యథావిధిగా కొనసాగించాలని కమ్యూనిస్ట్ నాయకులు డిమాండ్ చేశారు..

ఎయిర్ పోర్టును దూరం చేయొద్దు: సీపీఎం నేతల ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం విమానాశ్రయం(Visakhapatnam Airport) పరిరక్షణ కోసం సీపీఎం (CPM) ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ప్రజల అవసరాలు, ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత విశాఖ ఎయిర్‌పోర్టును యథావిధిగా కొనసాగించాలని కమ్యూనిస్ట్ నాయకులు డిమాండ్ చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్నప్పటికీ, విశాఖ పరిధిలోని ఈ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేయకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడే ఉంచాలని వారు స్పష్టం చేశారు.

అత్యంత దుర్మార్గమైన చర్య

ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధానిగా, పారిశ్రామిక హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం నుంచి విమానాశ్రయాన్ని దూరం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని సీపీఎం నేతలు మండిపడ్డారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్‌ను కేవలం 'డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్' గానైనా ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత విమానాశ్రయాన్ని మూసివేస్తే సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు దూరభారం, ఆర్థిక భారం తప్పవని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలకు తీవ్ర అన్యాయం

ఈ విషయంలో కూటమి ప్రభుత్వ నాయకులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ విశాఖ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎయిర్‌పోర్ట్‌ను తరలించడం, మూసివేత చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.

Next Story